కళ్లలో కారం పొడి చల్లి.. కత్తులతో దాడి

కళ్లలో కారం పొడి చల్లి.. కత్తులతో దాడి
  • అల్లుడి ఫ్యామిలీపై కత్తులతో దాడి
  • ఒకరు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు
  • నల్గొండ జిల్లాలో దారుణం

హాలియా, వెలుగు: పాత కక్షలు మనుసులో పెట్టుకొని అల్లుడి కుటుంబంపై  అత్త, మామ, బామ్మర్ది కత్తులతో దాడి చేశారు. అల్లుడి తల్లి మృతిచెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. నల్గొండ జిల్లా నిడమనూరు మండలం బొక్కమంతలపాడులో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. నిడమనూరు ఎస్సై సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. బొక్కమంతలపాడుకు చెందిన కమతం భిక్ష్మయ్య కొడుకు శివనారాయణకు అదే గ్రామానికి చెందిన జెల్లపల్లి సూర్యనారాయణ కుమార్తె శ్యామలతో అయిదేండ్ల క్రితం పెండ్లి జరిగింది. నాలుగేండ్లుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పెద్ద మనుషుల సమక్షంలో రాజీ కుదరగా.. వారిద్దరూ ఇప్పుడు కలిసే ఉంటున్నారు. ఫ్యామిలీ గొడవలను మనసులో పెట్టుకుని మంగళవారం ఉదయం 8. 30 గంటల సమయంలో సూర్యనారాయణ ఆయన భార్య యశోద, కొడుకు శివ ముగ్గురు కలిసి కత్తులతో అల్లుడు శివనారాయణ ఇంటికి వెళ్లారు. వెంట తీసుకెళ్లిన కారం పొడి చల్లి.. శివనారాయణ, అతడి తండ్రి భిక్షమయ్య, తల్లి అచ్చమ్మ, అమ్మమ్మ నారమ్మపై కత్తులతో దాడి చేశారు. విచక్షణ రహితంగా పొడవడంతో అచ్చమ్మ(55) అక్కడిక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన శివనారాయణ, భిక్షమయ్య, నారమ్ములను మిర్యాలగూడలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్​కు తరలించారు. శివనారాయణ ఫిర్యాదు మేరకు నిడమనూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.