ఎస్‌ఎల్‌బీసీ ఈ ఏడాదైనా పూర్తయితదా?..జూన్‌ లోపు పనులు పూర్తి చేసేలా సర్కారు టార్గెట్

ఎస్‌ఎల్‌బీసీ ఈ ఏడాదైనా పూర్తయితదా?..జూన్‌ లోపు పనులు పూర్తి చేసేలా సర్కారు టార్గెట్
  •     24/7 గంటలూ పనులు చేయాలని ఇటీవల ఆదేశాలు
  •     టన్నెల్​ నిపుణుడిని ఫారిన్‌ ట్రిప్‌కు తీసుకెళ్తున్న నిర్మాణ సంస్థ
  •     టీబీఎం లేకున్నా విడిభాగాల కోసం అంటూ10 రోజుల యూరప్​ పర్యటన​
  •     ప్రభుత్వమూ అనుమతి ఇచ్చిందన్న చర్చ 

హైదరాబాద్, వెలుగు:  ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు పరిస్థితి త్రిశంకు స్వర్గాన్ని తలపిస్తున్నది. కొన్నేండ్లుగా ప్రాజెక్టు పనులు ముందుకు సాగడం లేదు. ఈ ఏడాదైనా పనులు పూర్తవుతాయా? లేదా? అన్న ఆందోళన అధికారులను వెంటాడుతున్నది. ఈ ఏడాది జూన్‌లోపు పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకున్నది. వాస్తవానికి కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక నిరుడు డిసెంబర్‌‌నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని అనుకున్నది.  అయితే, అనుకోని ప్రమాదంతో దాదాపు 4  నెలలపాటు పనులు ఆగిపోయాయి. 

ఇన్‌లెట్​ వద్ద పైకప్పు కూలిన ఘటనలో 8 మంది సిబ్బంది చనిపోయారు. ఆ ప్రాంతం నుంచి టీబీఎం (టన్నెల్​ బోరింగ్​ మెషీన్​) భాగాలను ఇటీవలే బయటకు తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే పనులను పున:ప్రారంభించేందుకు సర్కారు నిర్ణయించింది.  ఎస్‌ఎల్‌బీసీ కోసమే ప్రత్యేకంగా ఓ డివిజన్‌ను ఏర్పాటు చేయడంతోపాటు స్పెషల్‌గా ఓ సీఈని  నియమించింది. 

అయితే, నిర్మాణ సంస్థ, ప్రభుత్వం ఏరికోరి తెచ్చుకున్న టన్నెల్​ ఎక్స్‌పర్ట్​ పరీక్షిత్​ మెహ్రా తీరు ఇప్పుడు డిపార్ట్​మెంట్‌కు తలనొప్పిగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ టన్నెల్​ పనులను వేగంగా చేయాల్సిందిపోయి.. ఇప్పుడు పరీక్షిత్​మెహ్రాను నిర్మాణ సంస్థ జేపీ అసోసియేట్స్​ విదేశీ పర్యటనలకు తీసుకెళ్తున్నదన్న చర్చ జరుగుతున్నది. విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోసం దరఖాస్తు చేసుకోగా.. ప్రభుత్వం అనుమతి కూడా ఇచ్చిందని తెలుస్తున్నది. 

టీబీఎం వాడే అవసరం లేకున్నా..

టన్నెల్​పైకప్పు కూలిపోవడంతో.. టన్నెల్​బోరింగ్​ మెషీన్‌తో పనులు ఇక చేయలేమని ఎక్స్‌పర్ట్స్​ ఇప్పటికే తేల్చారు. ఈ క్రమంలోనే డ్రిల్లింగ్​అండ్​బ్లాస్టింగ్​ (డీబీఎం)తోనే పనులు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకు తగ్గట్టుగానే ముందుకు వెళ్తున్నారు. ఇటీవల దీనిపై రివ్యూ చేసిన మంత్రి ఉత్తమ్​.. 24/7 పనులు చేయాలని ఆదేశాలిచ్చారు. 

అయితే, ఇప్పుడు టీబీఎం అవసరం లేకపోయినా.. టీబీఎం విడిభాగాలను పరిశీలించే పేరిట పరీక్షిత్​ మెహ్రాను నిర్మాణ సంస్థ 10 రోజుల యూరప్​ ట్రిప్​కు తీసుకెళ్తున్నట్టు సమాచారం. టన్నెల్​ పనులకు సంబంధించి ప్రతి ఫైలూ తన దృష్టిలోకి రావాలని పరీక్షిత్​ మెహ్రా చెప్పడంతో ఆయనతో నిర్మాణ సంస్థ సన్నిహితంగా మెలుగుతున్నదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లూ ఫండ్స్‌ కోసం పట్టుబట్టి పనులు చేయకుండా ఆపిన నిర్మాణ సంస్థ.. కాంగ్రెస్​ సర్కార్​ రూ.460 కోట్లు ఇచ్చినా.. ఇంకా నిధుల కోసమే పట్టుపడుతున్నది. మరో రూ.132 కోట్లు ఎస్క్రో అకౌంట్‌లో వేసేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. 

ఇలాంటి టైంలో పనులు వేగంగా చేయాల్సిన సంస్థ.. డెడ్​లైన్​లోపు పూర్తి చేయాల్సి ఉన్నా.. టీబీఎం సాకుతో విదేశీ పర్యటనలకు వెళ్లాల్సిన అవసరం ఏముందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. డ్రిల్లింగ్​ అండ్​ బ్లాస్టింగ్​ మెథడ్‌లోనే పనులు చేపడుతున్నా.. ఇంకా అడ్వాన్స్డ్‌ టెక్నాలజీలంటూ సాకులు చెబుతూ కావాలనే పనులను లేట్​ చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డబ్బుల కోసమే సంస్థ ఇలాంటి ఎత్తులు వేస్తున్నదని, రాష్ట్ర ప్రయోజనాల కోసం తీసుకొచ్చిన టన్నెల్​ ఎక్స్‌పర్ట్​ కూడా ఏజెన్సీ చెప్పినట్టు ఆడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాగే, ఎప్పటికప్పుడు పనులను లేట్​ చేస్తుంటే ఈ ఏడాదైనా పనులు పూర్తి కాబోవన్న చర్చ ఇరిగేషన్​ వర్గాల్లో జరుగుతున్నది. 

ఇంకో 32 శాతం పనులు చేయాలె..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ను మొత్తం 43.954 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్నారు. అందులో ఔట్‌లెట్‌​వైపు నుంచి 20.435 కిలోమీటర్లు, ఇన్‌లెట్​నుంచి 13.954 కిలోమీటర్ల పనులు జరిగాయి. మరో 9.54 కిలోమీటర్ల పనులు బ్యాలెన్స్​ ఉన్నాయి. టన్నెల్​ పైకప్పు కూలిపోవడంతో.. షియర్​ జోన్లు ఇంకెన్ని ఉన్నాయో తెలుసుకునేందుకు ప్రభుత్వం నేషనల్​ జియోలాజికల్​ రీసెర్చ్​ ఇనిస్టిట్యూట్‌తో హెలిబార్న్​ సర్వే చేయించింది. 

ఆ సర్వేకు తగ్గట్టుగా డ్రిల్లింగ్​ బ్లాస్టింగ్​ పద్ధతిలో టన్నెల్‌ను తవ్వాలని నిర్ణయించారు. రాక్​ బోల్ట్​ హోల్​ డ్రిల్లింగ్​, ఆర్​సీసీ (కాంక్రీట్​) కాస్టింగ్​పనులు జరుగుతున్నాయి. ప్రమాదంతో టన్నెల్‌లో ఉన్న నీళ్లను తోడివేసే పనులూ ముమ్మరంగా సాగుతున్నాయి. నిమిషానికి 4,381 లీటర్ల నీటిని తోడుతుండగా.. టీబీఎం కూలిన చోట నిమిషానికి మరో 1,486 లీటర్ల నీటిని తోడుతున్నారు. రైలు లైన్​ పనులను ముమ్మరంగా చేస్తున్నారు. 74 మంది కార్మికులతో ఆ పనులను చేయిస్తున్నారు. 

టన్నెల్​ ఔట్‌లెట్​ వద్ద టీబీఎంను ఇప్పటికే తొలగించేశారు. అక్కడ అధునాతన టెక్నాలజీతో పనులు చేయించాలని భావిస్తున్నారు. డ్రిల్లింగ్​ కోసం బూమర్​యంత్రాలు, కాంక్రీట్​ లైనింగ్​ కాస్టింగ్​ కోసం సీఫా షాట్‌క్రీట్, వెట్​షాట్​క్రీట్, సెల్ఫ్​లోడింగ్​ మిక్సర్​, ఎయిర్​ కూల్డ్​ లోకో ఇంజన్, ప్లాట్​ఫాం యాక్సిల్, ఎలక్ట్రిక్​ కంప్రెసర్‌‌లాంటి యంత్రాలను తీసుకురావాల్సి ఉంటుందని చెబుతున్నారు. అయితే, జూన్‌లోపు డెడ్​లైన్​ పెట్టుకున్నా.. అప్పటివరకు టన్నెల్​ పనులు పూర్తవుతాయా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.