జీతాల కోసం సమ్మెచేస్తే ఉద్యోగాల నుంచి తీసేస్తారా

జీతాల కోసం సమ్మెచేస్తే ఉద్యోగాల నుంచి తీసేస్తారా

సీఎం కేసీఆర్ పై YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంను ప్రశ్నించారన్న ఒకే ఒక్క కారణంతో 7,560 కుటుంబాలను రోడ్డున పడేశారని విమర్శించారు. ఇవాళ(బుధవారం) హైదరాబాద్ ఇందిరాపార్క్ దగ్గర కాంట్రాక్ట్ ఫీల్డ్ అసిస్టెంట్లు చేసిన ధర్నాలో పాల్గొని సంఘీబావం ప్రకటించారు షర్మిల. ప్రజల గురించి పట్టించుకోని కేసీఆర్ కు సీఎం పదవి అవసరం లేదన్నారు. తెలంగాణ విధానం, నినాదం, సిద్ధాంతమే ప్రశ్నించడమన్న సంగతిని కేసీఆర్ మరచిపోయి అందరినీ అణచివేస్తున్నారని విమర్శించారు.

బాధ్యతను మరచిపోయిన కేసీఆర్ కు..ఆ బాధ్యతను ఫీల్డ్ అసిస్టెంట్లు గుర్తు చేశారని, జీతాలను పెంచాలంటూ సమ్మె చేస్తే ఉద్యోగాల నుంచి వారిని తీసేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో సమ్మె చేసిన ఆర్టీసీ కార్మికులనూ ఇదే మాదిరి ఇబ్బందులు పెట్టారన్నారు. ప్రశ్నిస్తే ఎందుకంత అసహనమంటూ కేసీఆర్ ను నిలదీశారు. మంత్రులు, ఎమ్మెల్యేలకే కేసీఆర్ ను కలిసే అవకాశం లేదని.. అలాంటిది ప్రజలను ఎలా మాట్లాడనిస్తారని ఆమె అన్నారు. ప్రజల సమస్యలపై YSRTP పోరాడుతుందని షర్మిల స్పష్టం చేశారు.