- వచ్చే నెల రెండో వారం నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గ యాత్రలు
- రెండో విడత ప్రజాసంగ్రామ యాత్రను మొదలుపెట్టనున్న సంజయ్
- ఏప్రిల్ రెండో వారం నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర
- రాష్ట్రంలో సత్తా చాటేందుకు ఆప్ అడుగులు
- ఇప్పటికే యాత్రలు ప్రారంభించిన షర్మిల, ప్రవీణ్ కుమార్
హైదరాబాద్, వెలుగు: ‘ముందస్తు’ ఎన్నికల ప్రచారంతో రాజకీయ పార్టీలు, నేతలు జనాల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గాల్లో యాత్రలను చేపట్టనుంది. రెండో దశ ప్రజాసంగ్రామ యాత్రకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ సిద్ధమవుతున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ కూడా పాదయాత్రకు కసరత్తులు చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్తో మధ్యలోనే ఆగిపోయిన ‘ప్రజాప్రస్థాన యాత్ర’ను షర్మిల ఇప్పటికే తిరిగి ప్రారంభించారు. ‘బహుజన రాజ్యాధికార యాత్ర’ పేరిట బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర సమన్వయకర్త ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జనం వద్దకు వెళ్తున్నారు. ఈమధ్యనే పంజాబ్లో అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కూడా యాత్రల ద్వారా తెలంగాణలోనూ తన సత్తా చాటాలని ప్రయత్నాలు చేస్తోంది. పార్టీలు వేరైనా ప్రతిపక్షాలు ఒకే ఒక్క ఎజెండాతో యాత్రను చేపడ్తున్నాయి. టీఆర్ఎస్ కుటుంబ పాలన, అవినీతి, అక్రమాలను జనంలో ఎండగట్టాలని భావిస్తున్నాయి.
ఉగాది తర్వాత టీఆర్ఎస్ యాత్రలు
దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్కు ఘోర పరాభవం.. ఇటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఆశించిన స్థాయిలో సీట్లు రాక.. మజ్లిస్ పార్టీ మద్దతుతో మేయర్ పదవిని దక్కించుకుంది. ఈ నేపథ్యంలోనే జనాల్లో ఉన్న వ్యతిరేకతను పోగొట్టుకునేందుకు ఉగాది తర్వాత యాత్రలను చేపట్టాలని అధికార పార్టీ నిర్ణయించింది. ఏప్రిల్ తొలి వారం నుంచే జనాలకు చేరువయ్యేలా నియోజకవర్గ స్థాయిలో యాత్రలను చేపట్టాలంటూ ఎమ్మెల్యేలకు సూచనలిచ్చింది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని వివరించి ప్రజల్లో వ్యతిరేకతను పోగొట్టాలని నియోజకవర్గ ఇన్చార్జులకు సూచనలు చేసింది.
అంబేద్కర్ జయంతి రోజు నుంచి సంజయ్ యాత్ర
టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టడం, ఆ పార్టీనియంతృత్వ పాలనను, రాష్ట్రానికి కేంద్రం ఇస్తున్న నిధులు, అభివృద్ధిని జనంలోకి తీసుకెళ్లాలన్న లక్ష్యంతో సంజయ్.. రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించనున్నారు. అంబేద్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14న జోగులాంబ గద్వాల జిల్లా నుంచి యాత్రను మొదలు పెట్టాలని నిర్ణయించారు. దానికి సంబంధించి పాదయాత్ర కమిటీ ఏర్పాట్లను కూడా చేసేస్తోంది. రెండో విడత సంగ్రామ యాత్ర ప్రారంభానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా వస్తారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
హైకమాండ్ అనుమతికి కాంగ్రెస్ వెయిటింగ్
రాష్ట్రంలో ఈసారి వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తన సత్తా చాటాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ కూడా.. ప్రజల వద్దకు వెళ్లేందుకు నడుంబిగించింది. రేవంత్రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక.. కేడర్లో కొత్త జోష్ నిండినా హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. దీంతో అలాంటి ఫలితాలు మళ్లీ రాకుండా ఉండాలంటే జనానికి చేరువవ్వాలన్న ఉద్దేశంతో వచ్చే నెల రెండో వారం నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్రకు పార్టీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కార్, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని అనుకుంటున్నారు. అయితే, పాదయాత్రకు హైకమాండ్ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు.
యాత్రను ప్రారంభించనున్న కేజ్రీవాల్
తెలంగాణలో సత్తా చాటేందుకు వీలుగా యాత్రను ప్రారంభిస్తామని పార్టీ దక్షిణాది రాష్ట్రాల ఇన్చార్జి సోమ్నాథ్ భారతి ఇటీవలే ప్రకటించారు. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా ఈ యాత్రను ప్రారంభించనున్నారు. అవినీతి లేని ప్రభుత్వం, టీఆర్ఎస్ వైఫల్యాలను ఎజెండాలుగా చేసుకుని యాత్రకు ప్లాన్ చేస్తున్నారు. ఇటు సీపీఐ, సీపీఎం నేతలు కూడా తమకు పట్టున్న నియోజకవర్గాల్లో యాత్రలు చేసి జనానికి దగ్గరవ్వాలని ప్లాన్ చేస్తున్నారు.