బాయ్ ఫ్రెండ్ తో పెళ్లి కోసం అత్యాచారం డ్రామా

బాయ్ ఫ్రెండ్ తో పెళ్లి కోసం అత్యాచారం డ్రామా

నాగ్ పూర్ : బాయ్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకునేందుకు ఓ యువతి ఆడిన డ్రామా పోలీసులకు ముచ్చెమటలు పట్టించింది. తనపై సామూహిక అత్యాచారం జరిగిందంటూ ఫేక్ కంప్లైంట్ ఇవ్వడంతో నిజమేనని నమ్మిన అధికారులు నిందితుల్ని పట్టుకునేందుకు ఆరు గంటల పాటు ఉరుకులు పరుగులు పెట్టారు. నాగ్ పూర్ కమిషనరేట్ పరిధిలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
నాగ్ పూర్ కు చెందిన ఓ యువతి సోమవారం 11 గంటల సమయంలో కలమ్నా పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. అడ్రస్ కనుక్కునే నెపంతో తన దగ్గరకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు తనను బలవంతంగా ఓ తెల్ల వ్యాన్ లో కిడ్నాప్ చేశారని ఆ తర్వాత నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారని ఫిర్యాదు చేసింది. కేసు తీవ్రత దృష్ట్యా వెంటనే కంప్లైంట్ రిజిస్టర్ చేసిన పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలిసిన వెంటనే కమిషనర్ అమితేష్ కుమార్, అడిషనల్ సీపీ సునీల్ పుల్హారీ సహా పలువురు ఉన్నతాధికారులు స్టేషన్ కు చేరుకున్నారు. బాధితురాలితో మాట్లాడిన అనంతరం దాదాపు 1000 మంది పోలీసులతో 40 స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సిటీలోని 250 సీసీ టీవీల ఫుటేజ్ ను పరిశీలించడంతో పాటు యువతి స్నేహితులను ప్రశ్నించారు. బాధితురాలిని మెడికల్ ఎగ్జామినేషన్ కోసం మయో హాస్పిటల్ కు పంపారు. 
ఆరు గంటల పాటు కష్టపడి 250 సీసీటీవీల ఫుటేజ్ లను పరిశీలించినా, 50 మందిని ప్రశ్నించినా పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో అధికారులు ఆమె ఇంటి నుంచి బయలుదేరినప్పటి నుంచి ఎక్కడెక్కడకు వెళ్లిందన్న విషయాన్ని సీసీ టీవీ ఫుటేజ్ లో పరిశీలించారు. దాని ఆధారంగా ఆమె కట్టుకథ అల్లిందని నిర్థారించుకున్నారు. యువతిని గట్టిగా ప్రశ్నించగా అసలు విషయం చెప్పింది. అత్యాచారం జరగలేదని.. తన బాయ్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకునేందుకు కుటుంబసభ్యులు అంగీకరించకపోవడంతో ఈ డ్రామా ఆడినట్లు చెప్పింది. యువతి చెప్పిన మాట విన్న పోలీసులు అవాక్కయ్యారు.