తెలంగాణ హైకోర్టులో మహిళ ఆత్మహత్యాయత్నం

తెలంగాణ హైకోర్టులో మహిళ ఆత్మహత్యాయత్నం

తెలంగాణ హైకోర్టులో మంగళవారం మధ్యాహ్నం ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. పెండింగ్ కేసులో తీర్పు ఆలస్యం జరుగుతోందనే ఆవేదనతో కోర్టు బిల్డింగ్ ఎక్కి కిందకు దూకేందుకు ప్రయత్నించింది. వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది ఆమెను రక్షించి కిందకు తీసుకువచ్చారు.

పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనికి చెందిన కవిత అనే మహిళ గతంలో కేసు వేసింది. ఏప్రిల్ 11న తనపై మురళి అనే వ్యక్తి అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై అప్పటి నుంచి విచారణ జరుగుతూనే ఉంది. చాలా కాలంగా అది పెండింగ్‌లోనే ఉండటంతో తనకు న్యాయం ఎప్పుడు జరుగుతుందనే ఆవేదనతో కోర్టుకు వచ్చింది. రోజులు గడుస్తున్నా తీర్పు రాకపోవడంతో నిరాశకు గురై హైకోర్టు మొదటి అంతస్తు నుంచి దూకేందుకు ప్రయత్నించింది. అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై ఆమెను అడ్డుకున్నారు. సెక్యూరిటీ కార్యాలయంలో కూర్చోబెట్టి విచారిస్తున్నారు.