మోక్షజ్ఞ కాదు.. ముందుగా బాలయ్య కూతురు ఎంట్రీ..? స్పోర్ట్స్ డ్రామాతో హీరోయిన్‌గా తేజస్విని!

మోక్షజ్ఞ కాదు.. ముందుగా బాలయ్య కూతురు ఎంట్రీ..? స్పోర్ట్స్ డ్రామాతో హీరోయిన్‌గా తేజస్విని!

నందమూరి అభిమానులు ఎన్నో ఏళ్లుగా నటసింహం బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ సినీ అరంగేట్రం కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూశారు. కానీ ఇప్పుడు ఫిలింనగర్ వర్గాల్లో మరొక మైండ్ బ్లోయింగ్ వార్త హాట్ టాపిక్‌గా మారింది. బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని త్వరలోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్నారనే ప్రచారం టాలీవుడ్‌ని ఊపేస్తోంది.

 తేజస్విని తొలి చిత్రం మహిళా ప్రాధాన్యత కలిగిన కథతో పాటు బలమైన సామాజిక సందేశాన్ని అందించే స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం కథపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన మేకర్స్, స్క్రిప్ట్ పూర్తయిన తర్వాతే దర్శకుడు, ఇతర నటీనటులను ఖరారు చేయనున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

వైజాగ్ ఎంపీ, గీతం విద్యాసంస్థల అధినేత ఎం. శ్రీభరత్‌ను వివాహం చేసుకున్న తేజస్విని.. ఇప్పటివరకు తెరవెనుక క్రియాశీలక పాత్ర పోషించారు. ఆహాలో బాలయ్య రికార్డులు తిరగరాసిన సూపర్‌హిట్ టాక్ షో 'అన్‌స్టాపబుల్' క్రియేటివ్ కన్సల్టెంట్‌గా వ్యవహరించింది. అంతే కాదు ప్రస్తుతం తండ్రి సినిమాల ప్రమోషన్లు, తమ్ముడు మోక్షజ్ఞ లాంచ్ వ్యవహారాలను ఆమే దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

ఇక రీసెంట్‌గా కొరియోగ్రాఫర్ భాను మాస్టర్‌తో కలిసి 'సారంగ దరియా' పాటకు వేసిన డ్యాన్స్ రీల్స్ నెట్టింట వైరల్ గా మారింది. దీంతో ఆమె కెమెరా ముందుకు రాబోతున్నట్లు జరుగుతున్న ప్రచారానికి మరింత బలం చేకూర్చింది.  అంతే కాదు ఓ ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ అంబాసిడర్‌గా చేసిన యాడ్‌లో ఆమె గ్రేస్, ఆత్మవిశ్వాసం చూసి అభిమానులు ఫిదా అయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ స్థాయి ఎనర్జీతో మెరిసిన ఆమె, హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తే పక్కాగా రాణిస్తుందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

మరోవైపు బాలకృష్ణ  ఇటీవల రాజమండ్రిలో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న 'NBK111'  యాక్షన్ సీన్ షూటింగ్‌లో మోకాలికి గాయం కావడంతో విశ్రాంతి తీసుకుంటున్నారు. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో బిగ్ ప్రాజెక్ట్ చేయనున్నారు. అయితే తేజస్విని నటనా రంగ ప్రవేశంపై ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా ట్రెండ్ అవుతోంది.