V6 News

లోక్ సభకు 272 మంది మహిళా ఎంపీలు.. సభలో క్లారిటీగా చెప్పేసిన కేంద్రం

లోక్ సభకు 272 మంది మహిళా ఎంపీలు.. సభలో క్లారిటీగా చెప్పేసిన కేంద్రం

ఢిల్లీ: దేశంలోని అన్ని రాష్ట్రాల్లో లోక్ సభ స్థానాలు 50 శాతం పెరుగుతాయని లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. డీలిమిటేషన్లో భాగంగా రాష్ట్రాల నుంచి ఎన్నుకునే లోక్ సభ సభ్యుల సంఖ్య 815కి చేరుకుంటుందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ స్పష్టం చేశారు. డీలిమిటేషన్ వల్ల ఏ రాష్ట్రం నష్టపోదని ఆయన లోక్ సభలో చెప్పారు. మహిళా రిజర్వేషన్ను అమల్లోకి తెచ్చి లోక్ సభలో మూడింటి ఒక వంతు స్థానాలను మహిళలకు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు.

ఇందులో భాగంగా లోక్ సభలో మహిళల ప్రాతినిధ్యం 272 స్థానాలకు పెరుగుతుందని ఆయన చెప్పారు. మొత్తం 815 స్థానాల్లో 272 స్థానాలను మహిళలకే కేటాయించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రకటనపై మహిళా ఎంపీలు హర్షం వ్యక్తం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 81ని సవరించడం ద్వారా లోక్‌‌‌‌సభలో రాష్ట్రాల నుంచి ఎన్నుకొనే సభ్యుల సంఖ్యను గరిష్టంగా 815కి, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎన్నుకొనే వారి సంఖ్యను 35కి కేంద్ర ప్రభుత్వం పెంచాలని నిర్ణయించిది. 2029 ఎన్నికలనుంచే మహిళలకు 33% రిజర్వేషన్లను అమలు చేయనున్నారు. ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరిలాంటి శాసనసభ కలిగిన కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా వర్తించేలా ప్రత్యేక బిల్లులను ప్రభుత్వం ఇప్పటికే ప్రవేశపెట్టింది. ఈ బిల్లులపై ఓటింగ్ శుక్రవారం సాయంత్రం జరగనుంది.

లోక్‌‌‌‌సభ, రాష్ట్రాల శాసనసభలలో మహిళలకు మూడింట ఒక వంతు (33%) సీట్లను కేటాయించనున్నారు. ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన స్థానాల్లో కూడా మహిళలకు అంతర్గత రిజర్వేషన్లు వర్తిస్తాయి. మహిళలకు  ప్రతి ఎన్నికల్లో వేర్వేరు నియోజకవర్గాలకు మారుస్తూ  రొటేషన్ పద్ధతిలో సీట్లను కేటాయిస్తారు. తాజా జనాభా లెక్కల  ఆధారంగా రాష్ట్రాలకు కేటాయించే సీట్ల సంఖ్యలో మార్పులు జరుగుతాయి. నియోజకవర్గాల విభజన సమయంలో భౌగోళిక సామీప్యత, పరిపాలనా సౌలభ్యం, ప్రజల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుంటారు. మహిళల ప్రాతినిథ్యాన్ని ప్రజాస్వామ్యంలో మరింత వేగవంతం చేయడం కోసమే ఈ చర్యలు చేపట్టినట్టు కేంద్ర ప్రభుత్వం పేర్కొన్న సంగతి తెలిసిందే.