తెలంగాణలోని నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఏప్రిల్ 24 సోమవారం ఉదయం కాలేజీ గేటు ఎదుట మహిళా కార్మికులు బైఠాయించి నిరసన తెలిపారు. ఇటీవల ట్రిపుల్ ఐటీలో పని చేస్తున్న ఐదుగురు కాంట్రాక్ట్ కార్మికులను విధుల నుంచి తొలగించారు అధికారులు. ఈ క్రమంలో కార్మికులంతా కలిసి ధర్నా చేపట్టారు.
రెండు నెలలుగా తమకు జీతాలు ఇవ్వడం లేదని.. పెండింగ్ వేతనాలను అడిగినందుకే కాంట్రాక్టర్ కక్ష్యసాధింపు చర్యలకు దిగుతున్నాడని కార్మికులు ఆరోపిస్తున్నారు. జీతాలు అడుగుతే ఉద్యోగం నుండి తొలగిస్తారా అంటూ అధికారులను నిరదీశారు కార్మికులు. ఐదుగురు కార్మికులకు మద్దతుగా విధులు నిర్వహిస్తున్న మిగితా 200 కార్మికులు విధులు బహిష్కరించారు. తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. కాలేజీ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని పోలీసులు కార్మికులకు హామీ ఇచ్చారు.

