Women's T20 World Cup 2026: క్రికెట్ ప్రపంచంలో మహిళా క్రికెటర్ల రేంజ్ మాములుగా పెరగట్లేదు. గ్లోబల్ మార్కెట్లో వాళ్లకున్న క్రేజ్ చూసి ఐసీసీ (ICC) మైండ్ బ్లాక్ అయ్యే నిర్ణయం తీసుకుంది. ఇంగ్లాండ్ వేదికగా ఈరోజు (జూన్ 12) నుంచే షురూ అవుతున్న 'మహిళా టీ20 వరల్డ్ కప్ 2026' కోసం ప్రైజ్ మనీని భారీగా పెంచేసింది. ఈసారి టోర్నమెంట్లో జట్ల సంఖ్యను పెంచడమే కాదు.. క్రికెట్ ఫైట్ మరింత కిర్రాక్గా ఉండటానికి ఫార్మాట్ను కూడా మార్చేసింది.
విజేతలకి భారీగా ప్రైజ్ మనీ:
ఐసీసీ ఈసారి మహిళా క్రికెటర్ల కోసం ప్రైజ్ మనీని భారీగా పెంచి పురుషుల క్రికెట్ రేంజ్కు తీసుకెళ్తోంది. ఈసారి ఛాంపియన్గా నిలిచే టీమ్కు ఏకంగా 2.34 మిలియన్ డాలర్లు (మన కరెన్సీలో సుమారు రూ.22 కోట్లకు పైనే) ప్రైజ్ మనీ దక్కనుంది. ఇక ఫైనల్లో ఓడిపోయిన రన్నరప్ టీమ్కు కూడా 1.17 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.11 కోట్లు) ఇస్తారు. అలాగే సెమీఫైనల్ దాకా వచ్చి అవుట్ అయ్యే రెండు జట్లకు కూడా తలా రూ.6.56 కోట్ల చొప్పున భారీ నజరానా అందుతుంది. టోర్నీలో ఆడే ప్రతి జట్టుకు కనీస గ్యారెంటీగా 247,500 డాలర్లు (దాదాపు రూ.2 కోట్లు) ఖచ్చితంగా ఇస్తారు.
12 జట్లు.. 33 మ్యాచ్లు:
ఉమెన్స్ వరల్డ్ కప్ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్ ఈసారి రికార్డు స్థాయిలో మొత్తం 12 జట్లు కప్పు కోసం కొట్లాడబోతున్నాయి. టోర్నీని మరింత ఇంట్రెస్టింగా మార్చడానికి ఐసీసీ పక్కా ప్రణాళిక వేసింది. 12 జట్లను చెరో 6 జట్లతో రెండు గ్రూపులుగా విడదీశారు. లీగ్ స్టేజ్లో ప్రతి టీమ్ తమ గ్రూప్లోని మిగిలిన 5 జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. రెండు గ్రూపుల నుంచి టాప్-2 లో నిలిచిన జట్లు నేరుగా సెమీఫైనల్కు క్వాలిఫై అవుతాయి. ఇంగ్లాండ్లోని 7 ఇంటర్నేషనల్ మైదానాల్లో మొత్తం 33 ఉత్కంఠభరిత మ్యాచ్లు జరగనున్నాయి.
ఒకే గ్రూప్లో భారత్, పాకిస్తాన్:
* క్రికెట్ ఫ్యాన్స్కు అసలైన పూనకాలు తెప్పించే ముచ్చట ఏంటంటే.. చిరకాల ప్రత్యర్థులు ఇండియా, పాకిస్తాన్ జట్లు ఒకే గ్రూప్లో ఉన్నాయి.
* గ్రూప్1: భారత్ , పాకిస్తాన్లతో పాటు డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్
* గ్రూప్-2: ఆతిథ్య ఇంగ్లాండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంక, స్కాట్లాండ్, ఐర్లాండ్ జట్లు
