
అక్కడున్నది 49 మంది ఓటర్లే. కానీ, 70 మంది ఓటేశారు. పోలింగ్ 143 శాతం నమోదైంది. చదవడానికి విచిత్రంగా అనిపించినా అదే నిజం. ప్రపంచంలోనే ఎత్తైన పోలింగ్ స్టేషన్ తషిగాంగ్ గ్రామంలో జరిగిందీ వింత ఓటింగ్. హిమాచల్ ప్రదేశ్లో ఉన్న ఆ గ్రామం సముద్ర మట్టానికి 15,256 అడుగుల ఎత్తులో ఉంది. పడిన ఓట్లన్నీ ‘కరెక్ట్’ అని రిటర్నింగ్
అధికారులూ ప్రకటించడం మరింత విడ్డూరం. మరి, మిగతా ఓటర్లెలా వచ్చారు? అంటే తషిగాంగ్, ఆ పక్కనున్న ఊళ్లలో పోలింగ్ డ్యూటీ పడిన పోలింగ్ అధికారులు తషిగాంగ్లోనే ఓటేశారు. ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్ (ఈడీసీ)ని చూపించి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో పోలింగ్ 142.85 శాతానికి చేరిందన్నమాట. నిజానికి ఆ ఊళ్లోని 49 మంది ఓటర్లలో ఓటేసింది 36 మందే. అందులో 21 మంది మగవాళ్లు, 15 మంది మహిళలున్నారు. అంటే నిజానికి అక్కడైన పోలింగ్ 74 శాతం మాత్రమే. మిగతా అన్ని ఓట్లూ పోలింగ్ అధికారులవే. వాళ్లు అక్కడే ఎందుకు ఓటేశారంటే.. ప్రపంచంలోనే ఎత్తైన పోలింగ్ కేంద్రం కదా. అందుకే అక్కడే ఓటేస్తే కొంచెం గుర్తింపైనా దక్కుతుందని ఆశ పడ్డారు. అందరూ అక్కడే ఓటేశారు. అదన్నమాట సంగతి
.