హాకీ ప్లేయర్ ఇంటికెళ్లి అభినందించిన మముట్టి

హాకీ ప్లేయర్ ఇంటికెళ్లి అభినందించిన మముట్టి

కోచి: భారత పురుషుల హాకీ జట్టు క్రీడాకారుడు శ్రీజేష్ ను మళయాళ సూపర్ స్టార్ మముట్టి స్వయంగా ఇంటికి వెళ్లి అభినందించి ఆశ్చర్యపరిచారు. టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన భారత పురుషుల హాకీ జట్టులో గోల్‌ కీపర్‌ అయిన శ్రీజేష్‌ ఇంటికి గురువారం స్వయంగా తరలివెళ్లారు. భారత హాకీ జట్టు అత్యుత్తమ ప్రదర్శనతో దాదాపు 49 ఏళ్ల తర్వాత సెమీస్ వరకు వెళ్లి పతకంతో తిరిగి రావడం ప్రపంచ వ్యాప్తంగా అభినందనలు, ప్రశంసలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా.. సరైన ప్రోత్సాహం లేకున్నా భారత క్రీడాకారులు కసిగా పోరాడి ఆడిన తీరు అందర్నీ గర్వించేలా చేసింది. కేంద్ర ప్రభుత్వంతోపాటు సొంత రాష్ట్రాల ప్రభుత్వాలు, ప్రముఖులు భారత ఒలంపిక్స్ క్రీడకారులను తమదైన శైలిలో నజరానాలు, బహుమతులతో సత్కరిస్తున్న విషయం తెలిసిందే. 
ఈ నేపధ్యంలో సాదాసీదా జీవనానికి ఇష్టపడే మళయాళ సూపర్ స్టార్ తన సహజశైలికి తగినట్లు కోచిలోని  శ్రీజేష్‌ ఇంటికి స్వయంగా వెళ్ళారు. ఒలింపిక్స్ లో  అద్భుత ప్రతిభ కనబర్చిన గోల్ కీపర్ శ్రీజేష్ తో పాటు మొత్తం జట్టు సభ్యులకు మమ్ముటి అభినందనలు తెలిపారు. కుటుంబ సభ్యులతో కొద్దిసేపు సరదాగా గడిపారు. సూపర్ స్టార్ శ్రీజేష్ ఇంటికి వచ్చిన విషయం తెలిసి చూసేందుకు చుట్టుపక్కల వారు భారీగా  తరలివచ్చినా.. కోవిడ్ నేపధ్యంలో మముట్టి నిబంధనలు పాటించాలని కోరుతూ వెళ్లిపోయారు.