చనిపోయిన నిషా నేను కాదు

చనిపోయిన నిషా నేను కాదు

గోండ: వారిద్దరూ రెజ్లర్లే. ఇద్దరి పేర్లు ఒక్కటే. అయితే, బుధవారం మధ్యాహ్నం జరిగిన ఓ దుర్ఘటనలో వీరిలో ఒకరు మరణించారు. ఇద్దరి పేర్లు ఒక్కటే కావడంతో ప్రాణాలతో ఉన్న మరొకరికి  ఊహించని సమస్య ఎదురైంది. నేను బతికే ఉన్నా అంటూ చెప్పుకోవాల్సిన  పరిస్థితి వచ్చింది. బెల్‌‌గ్రేడ్‌‌లో ఇటీవల జరిగిన అండర్‌‌–23 వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో బ్రాంజ్‌‌ మెడల్‌‌ గెలిచిన నిషా దహియా ఈ వింత పరిస్థితిని ఎదుర్కొంది. 

అసలేం జరిగిందంటే..!  హర్యానా సోనిపట్‌‌లోని సుశీల్‌‌ కుమార్‌‌ రెజ్లింగ్​ అకాడమీలో బుధవారం మధ్యాహ్నం దుండగులు జరిపిన కాల్పుల్లో యూనివర్సిటీ స్థాయి రెజ్లర్‌‌ నిషా దహియా(20), ఆమె సోదరుడు సూరజ్‌‌(18) ప్రాణాలు కోల్పోయారు. వారి తల్లి తీవ్రంగా గాయపడింది. అయితే, వరల్డ్‌‌ మెడల్‌‌ గెలిచిన నిషానే మరణించిందని వార్తలు వ్యాపించాయి. నేషనల్‌‌ చాంపియన్‌‌షిప్స్‌‌ కోసం ఉత్తరప్రదేశ్‌‌లోని గోండకు వెళ్లిన నిషా..ఈ విషయాన్ని తెలుసుకుని షాక్‌‌ అయ్యింది. చివరకు తాను బతికే ఉన్నానంటూ వివరణ ఇస్తూ ఓ వీడియోను రిలీజ్‌‌ చేసిన నిషా  తప్పుడు వార్త వ్యాప్తిని అడ్డుకుంది.