
యాదాద్రి, నల్గొండ అర్బన్, వెలుగు : ఎవరైనా కల్తీ ఎరువులు, నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని యాదాద్రి, నల్గొండ కలెక్టర్లుహనుమంతరావు, ఇలా త్రిపాఠి హెచ్చరించారు. ఎమ్మార్పీ కంటే ఎక్కువ రేట్లను విక్రయించినా చర్యలు తప్పవన్నారు. ఆయా కలెక్టరేట్లలో జరిగిన రివ్యూ మీటింగ్లో వారు మాట్లాడారు. ఫర్టిలైజర్ షాపుల్లో లైసెన్స్, స్టాక్ రిజిస్టర్, బిల్ రిజిస్టర్, ఎరువులు, పురుగుల మందుల స్టాక్స్ను డీలర్స్ పక్కాగా మెయింటైన్ చేయాలన్నారు. ధరల పట్టిక, విత్తన ప్యాకెట్ల స్టాక్ వివరాలు, షాపుల ముందు బోర్డులపై ఉంచాలన్నారు.
మండల, గ్రామస్థాయిల్లో ప్రత్యేక స్పెషల్ టాస్క్ ఫోర్స్ కమిటీలు నిరంతరం నిఘా, తనిఖీలు చేస్తాయని చెప్పారు. నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని తెలిపారు. ఎరువులు, విత్తనాలు బ్లాక్ మార్కెట్కు తరలించే వారిపై చర్యలు తీసుకుంటామని, లైసెన్స్ క్యానిల్స్ చేస్తామని చెప్పారు. విత్తనాల కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. ఈ సందర్భంగా డీలర్లకు ఈ-–పాస్ మిషన్లను అందించారు.
ఎరువుల దుకాణాల్లో తనిఖీలు..
సూర్యాపేట, వెలుగు : ఎవరైనా, ఎక్కడైనా నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ హెచ్చరించారు. బుధవారం అర్వపల్లి మండల కేంద్రంలోని మన గ్రోమోర్ సెంటర్, సూర్యాపేట మార్కెట్ లోని ఎరువుల దుకాణాలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్తీ విత్తనాలు అరికట్టి నాణ్యమైన ఎరువులు, విత్తనాలు రైతులకు అందించాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. రైతులకు ఖరీఫ్ సీజన్ కు సరిపడే ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. గుర్తింపు పొందిన డీలర్లు ఈ-పాస్ మిషన్ ద్వారానే ఎరువులు విక్రయించాలని చెప్పారు. ఆయన వెంట జిల్లా వ్యవసాయశాఖ అధికారి శ్రీధర్ రెడ్డి, ఆర్డీవో వేణుమాధవ్, మండల అధికారులు ఉన్నారు.