
యాదగిరికొండ, వెలుగు : కల్యాణానికి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సిద్ధమయ్యాడు. బుధవారం ఉదయం 11 గంటలకు బాలాలయ మండపంలో స్వామి, అమ్మవార్ల కల్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించడానికి సుమూహూర్తం నిర్ణయించారు. రాత్రి కొండ కింద బస్టాండ్ ఎదురుగా ఉన్న పాత జడ్పీహైస్కూల్ ఆవరణలో కల్యాణ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. స్వామి, అమ్మవార్లకు ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. వీఐపీలు కల్యాణం తిలకించేందుకు వీలుగా ప్రత్యేక గ్యాలరీలు, భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సదుపాయాలు కల్పించారు.
రాత్రి ఎదుర్కోలు మహోత్సవం
లక్ష్మీనర్సింహుడి ఎదుర్కోలు మహోత్సవాన్ని మంగళవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. బాలాలయ ఉత్సవ మండపంలో స్వామి, అమ్మవార్లను ఎదురెదురుగా ప్రతిష్ఠించి, ఇరువైపులా దేవస్థాన చైర్మన్ నర్సింహమూర్తి అమ్మవారి తరఫున, ఈవో గీతారెడ్డి స్వామివారి తరఫున పెండ్లిపె ద్దలుగా వ్యవహరించారు. చైర్మన్ అమ్మవారి అందచందాలు, సుగుణాలు కీర్తించగా.. స్వామి వారి వైపు గల ఈవో స్వామి మహిమాన్విత్వాన్ని వివరించారు.