బస్వాపురం స్ట్రక్చర్ పేమెంట్ రిలీజ్​ .. 491 మంది నిర్వాసితులకు నోటీసులు

బస్వాపురం స్ట్రక్చర్ పేమెంట్ రిలీజ్​ .. 491 మంది నిర్వాసితులకు నోటీసులు

యాదాద్రి, వెలుగు : దీర్ఘకాలికంగా పెండింగ్​లో ఉన్న బస్వాపురం నిర్వాసితులకు స్ట్రక్చర్ వ్యాల్యూ పేమెంట్ పంపిణీ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం నిర్వాసితులకు ఫారం-37 నోటీసులు అందిస్తున్నారు. నోటీసులకు రిప్లయ్​ఇచ్చిన వాళ్ల అకౌంట్స్​లో నేటి నుంచి అమౌంట్​జమ కానుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా యాదాద్రి జిల్లాలోని పది మండలాల్లో 1.88 లక్షల ఎకరాలకు సాగు నీరందించడానికి బస్వాపురం రిజర్వాయర్​ను 16వ ప్యాకేజీగా నిర్మిస్తున్నారు. దీని నిర్మాణం కోసం రూ. 1,610 కోట్లు అంచనా వేయగా, రూ. 1200 కోట్లు ఖర్చు చేశారు. ఈ రిజర్వాయర్​85 శాతానికి పైగా పూర్తయింది. అయితే ఈ రిజర్వాయర్​ కారణంగా భువనగిరి మండలం బీఎన్​ తిమ్మాపూర్​ పూర్తిగా మునిగిపోతోంది. ఈ గ్రామంలోని వారికి ఆర్​ అండ్​ ఆర్​ప్యాకేజీ కింద 1,075 మందికి ఇండ్ల నిర్మాణం కోసం ఖాళీ స్థలం ఇవ్వడంతోపాటు ఒక్కొక్కరికి రూ.7.61 లక్షల చొప్పున అందించారు. 

తాజాగా స్ట్రక్చర్ వ్యాల్యూ..

ఈ రిజర్వాయర్​ కారణంగా గ్రామంలోని 834 ఇండ్లు, ఖాళీ స్థలాలు సహా బోరు బావులు, చెట్లు మునిగిపోనున్నాయి. ఈ స్ట్రక్చర్​ను వెరిఫికేషన్ చేసి వీటి విలువ రూ.109 కోట్లుగా గుర్తించారు. అయితే ఈ మొత్తం పంపిణీ చేయకపోవడంతో దాదాపు రెండేండ్లుగా పెండింగ్​లో పడింది. తాజాగా వీరందరికీ స్ట్రక్చర్ వ్యాల్యూ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తక్కువ మొత్తంలో నష్టపోతున్నవారికి ముందస్తుగా పేమెంట్​ రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ లెక్కన 491 మందికి రూ.30 కోట్లు చెల్లించాల్సి ఉంది.  ఇందులో భాగంగా నిర్వాసితులకు ఫారం 37 నోటీసులను జారీ చేసింది. ఈ నోటీసులను రెవెన్యూ సిబ్బంది నిర్వాసితులకు అందిస్తున్నారు. ఈ నోటీసులు అందుకున్న వారు తాము నష్టపోతున్న వాటి వివరాలు, తమకు సంబంధించిన పూర్తి వివరాలను భువనగిరి ఆర్డీవో కార్యాలయంలో అందించాల్సి ఉంది. కాగా అడిషనల్ కలెక్టర్ జీ వీరారెడ్డి, ఆర్డీవో కృష్ణారెడ్డి గురువారం బీఎన్​ తిమ్మాపురంను సందర్శించి నిర్వాసితులతో మాట్లాడారు. 

నేటి నుంచి అకౌంట్లలో..

నోటీసులు అందుకున్న 491 మంది తమ వివరాలను ఆర్డీవో ఆఫీసులో అందించే ప్రక్రియ దాదాపు పూర్తయింది. దీంతో శుక్రవారం నుంచి తక్కువ మొత్తంలో నష్టపోయినవారి అకౌంట్లలో మొదటగా అమౌంట్​జమ చేయనున్నారు. ఈ విధంగా ఈ వారంలోపు అందరికీ పేమెంట్ జమ చేస్తామని ఆఫీసర్లు చెబుతున్నారు. వీరికి పేమెంట్​అందిన తర్వాత మిగిలిన వారందరికీ ఫారం 37 నోటీసులు అందిస్తామని, అనంతరం స్టక్చర్ పేమెంట్​జమ చేస్తామని ఆర్డీవో తెలిపారు.