మే 9 నుంచి శ్రీ లక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాలు

మే 9 నుంచి శ్రీ లక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాలు
  • 9 నుంచి 11 వరకు ఆర్జిత సేవలు బంద్

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాలకు యాదగిరి క్షేత్రం ముస్తాబవుతోంది. ఈనెల 9 నుంచి 11 వరకు మూడు రోజులపాటు జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ మూడు రోజులపాటు స్వామివారి ఆర్జిత సేవలు, నిత్య, శాశ్వత, మొక్కు కల్యాణాలు, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమం పూజలను తాత్కాలికంగా రద్దు చేశారు. ఈనెల 9న ఉదయం 8:45 గంటలకు, పాతగుట్ట ఆలయంలో కూడా ఉదయం 8:45 గంటలకు స్వస్తివాచనం, విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, కుంకుమార్చన, మృత్సంగ్రహణం, అంకురార్పణ, హవనంతో జయంతి ఉత్సవాలకు అర్చకులు శ్రీకారం చుట్టనున్నారు. 

ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో స్వామివారికి సంబంధించిన పలు అలంకార సేవలు నిర్వహించనున్నారు. యాదగిరిగుట్ట, పాతగుట్టతోపాటు అనుబంధ ఆలయమైన దబ్బగుంటపల్లిలోని యోగానంద నరసింహస్వామి టెంపుల్ లో కూడా జయంతి ఉత్సవాలు ఏకకాలంలో చేపట్టనున్నారు. 11న నిర్వహించే పూర్ణాహుతి, నరసింహుడి జయంతి, నృసింహ అవతార ఆవిర్భావ ఘట్టంతో ఉత్సవాలు ముగియనున్నాయి.