యాదగిరిగుట్టలో చింతపండు చోరీ ఘటనపై.. ఫైవ్ మెన్ కమిటీ

యాదగిరిగుట్టలో చింతపండు చోరీ ఘటనపై.. ఫైవ్ మెన్ కమిటీ
  • నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం
  • అవసరమైతే బాధ్యులను సర్వీసు నుంచి తొలగిస్తాం 
  • ఎండోమెంట్ డైరెక్టర్, యాదగిరిగుట్ట ఆలయ ఈవో వెంకటరావు వెల్లడి

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట ఆలయంలోని ప్రసాద తయారీ కేంద్రంలో చింతపండు చోరీ ఘటనపై ఆలయ డిప్యూటీ ఈవో దోర్బల భాస్కర్ శర్మ నేతృత్వంలో ‘ ఫైవ్ మెన్' కమిటీ వేశామని దేవాదాయ శాఖ డైరెక్టర్, యాదగిరిగుట్ట ఆలయ ఈవో వెంకటరావు తెలిపారు. గురువారం గుట్ట క్యాంప్ ఆఫీస్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఫైవ్ మెన్ కమిటీ సమగ్ర విచారణ జరిపి రిపోర్ట్ ఇస్తుందని, దాని ఆధారంగా చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. సిబ్బంది నుంచి ఉన్నతస్థాయి అధికారుల పాత్ర ఉందని తేలినా ఉపేక్షించబోమని, అవసరమైతే విధుల నుంచి శాశ్వతంగా తొలగిస్తామని తేల్చి చెప్పారు.

 కొన్నేండ్లుగా ఆలయ అధికారులు ఒకే సెక్షన్ లో కొనసాగుతుండడం తన దృష్టికి వచ్చిందని, త్వరలోనే బదిలీలు ఉంటాయని చెప్పారు. చింతపండు చోరీ ఘటన ఆలయ చరిత్రలో ఇదే తొలిసారి కావడం బాధాకరమని, ఇకపై రిపీట్ కాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. అవసరమైతే ప్రభుత్వంతో చర్చించి అదనంగా ఎస్పీఎఫ్, హోంగార్డులను రప్పించి భద్రత కట్టుదిట్టం చేస్తామన్నారు. ఘటనలో ఇప్పటికే ఇద్దరు ఆలయ సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశామని, కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అనంతరం గుట్టలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యను ఈవో వెంకటరావు మర్యాదపూర్వకంగా కలిశారు. లడ్డూప్రసాదం, స్వామివారి శేషవస్త్రాలు అందజేశారు.

 అనంతరం ఎమ్మెల్యేతో ఆయన గంటపాటు చర్చించారు.  చింతపండు చోరీ ఘటన జరిగిన నేపథ్యంలో ఎమ్మెల్యేను ఈవో కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.  ఘటన వెనుక ఆలయ ఉన్నతాధికారుల హస్తం ఉందని స్థానిక భక్తులు ఆరోపిస్తుండగా.. కమిటీ నివేదికపై ఉత్కంఠ నెలకొంది. కఠిన చర్యలు ఉంటాయా.? లేక గతంలో మాదిరిగానే కిందిస్థాయి అధికారులపై నెట్టేసి చేతులు దులుపుకుంటారా.? అనేదానిపై భక్తులు ఎదురుచూస్తున్నారు.