యాదగిరిగుట్ట ఆలయంలో చింతపండు చోరీకి యత్నం

యాదగిరిగుట్ట ఆలయంలో చింతపండు చోరీకి యత్నం
  • కన్వేయర్‌‌ బెల్ట్‌‌ ద్వారా బయటకు తరలించిన ఔట్‌‌ సోర్సింగ్‌‌ సిబ్బంది
  • పోలీసులను చూసి పరార్‌‌
  • ఏమీ తెలియనట్లు తిరిగి డ్యూటీకి
  • అనుమానం వచ్చి ప్రశ్నించడంతో చోరీ విషయం ఒప్పుకున్న యువకులు

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట దేవస్థానంలో పనిచేస్తున్న ఇద్దరు ఔట్‌‌ సోర్సింగ్‌‌ ఉద్యోగులు బుధవారం తెల్లవారుజామున చింతపండు చోరీకి యత్నించారు. ఇదే టైంలో పెట్రోలింగ్‌‌కు వచ్చిన పోలీసులను చూసి పరార్‌‌ అయ్యారు. తిరిగి బుధవారం ఉదయం యథావిధిగా డ్యూటీకి వచ్చారు. వీరి కదలికలపై అనుమానం వచ్చిన ఎస్పీఎఫ్‌‌ సిబ్బంది గట్టిగా నిలదీయడంతో అసలు విషయం ఒప్పుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. రాజాపేట మండలం బేగంపేటకు చెందిన గణేశ్‌‌, తుర్కపల్లి మండలం గంధమల్లకు చెందిన మధు కొన్ని రోజులుగా ఆలయ ప్రసాద తయారీ కేంద్రంలో ఔట్‌‌ సోర్సింగ్‌‌ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు.

బుధవారం తెల్లవారుజామున 2.25 గంటలకు ప్రసాద తయారీ కేంద్రంలో ఉన్న 10 చింతపండు బస్తాలను కన్వేయర్‌‌ బెల్ట్‌‌ ద్వారా బయటకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి కారులో తరలించేందుకు ప్రయత్నించారు. ఇదే సమయంలో పోలీసులు పెట్రోలింగ్‌‌కు రావడాన్ని గమనించి కారు, చింతపండు బస్తాలను అక్కడే వదిలి పరార్‌‌ అయ్యారు. గమనించిన పోలీసులు ఎస్పీఎఫ్‌‌ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు నిందితుల కోసం గాలిస్తుండగా.. మెట్ల మార్గంలో ఇద్దరు వ్యక్తులు కనిపించారు.

.వారిని పట్టుకొని ప్రశ్నించగా.. తాము దైవదర్శనానికి వచ్చామని చెప్పడంతో వదిలేశారు. బుధవారం ఉదయం గణేశ్‌‌, మధు ఏమీ తెలియనట్లుగా తిరిగి డ్యూటీకి హాజరయ్యారు. వారిని గుర్తించిన ఎస్పీఎఫ్‌‌ సిబ్బంది దైవదర్శనానికి వచ్చిన మీరు ఇక్కడేం చేస్తున్నారని ప్రశ్నించడంతో తాము ఔట్‌‌ సోర్సింగ్‌‌ ఉద్యోగులమని చెప్పారు. అనుమానం వచ్చిన ఎస్పీఎఫ్‌‌ సిబ్బంది గట్టిగా నిలదీయడంతో చింతపండు చోరీకి యత్నించింది తామేనని ఒప్పుకున్నారు.

 దీంతో వారిద్దరిని అదుపులోకి తీసుకొని యాదగిరిగుట్ట పోలీసులకు అప్పగించారు. గణేశ్‌‌, మధుపై కేసు నమోదు చేసినట్లు యాదగిరిగుట్ట సీఐ భాస్కర్‌‌ తెలిపారు. కాగా చోరీ ఘటనపై ఉన్నతాధికారుల హస్తం ఉందని బీఆర్‌‌ఎస్‌‌, బీజేపీ, సీపీఐ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు బుధవారం డిప్యూటీ ఈవో దోర్బల భాస్కర్‌‌శర్మను కలిసి ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారుల ప్రమేయం లేకుండా కొండపైకి కారు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఎస్పీఎఫ్‌‌ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని, పూర్తిస్థాయిలో విచారణ జరిపి అసలు దోషులను పట్టుకోవాలని డిమాండ్ చేశారు.