మే 2 నుంచి యాదగిరీశుడి జయంతి ఉత్సవాలు

మే 2 నుంచి యాదగిరీశుడి జయంతి ఉత్సవాలు

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో మే 2 నుంచి 4 వరకు స్వామి జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. యాదగిరిగుట్ట ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలైన పాతగుట్ట, దబ్బగుంటపల్లిలోని యోగానంద నరసింహస్వామి టెంపుల్ లో కూడా ఉత్సవాలు ఏకకాలంలో నిర్వహించనున్నట్లు మంగళవారం ఆలయ ఈవో గీతారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆఫీసర్లను ఆదేశించారు. యాదగిరిగుట్ట, పాతగుట్ట ఆలయాల్లో 2న ఉదయం 9.30 గంటలకు స్వస్తివాచనం, విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, కుంకుమార్చన.. సాయంత్రం 6 గంటలకు మృత్సంగ్రహణం, అంకురార్పణ, హవనంతో జయంతి ఉత్సవాలకు అర్చకులు శ్రీకారం చుట్టనున్నారు. మే 4న నిర్వహించే పూర్ణాహుతి, నరసింహుడి జయంతి, నృసింహ అవతార ఆవిర్భావ ఘట్టంతో ఉత్సవాలు ముగియనున్నాయి.