ఈ నేలల్లో వరి తప్ప ఇంకేం పండదని తెలియదా?

ఈ నేలల్లో వరి తప్ప ఇంకేం పండదని తెలియదా?

సదాశివ నగర్: టీఆర్ఎస్ ఎవరి మీద చావు డప్పు కొడుతోందని వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల ప్రశ్నించారు. కేసీఆర్ స్వార్థ రాజకీయాల కోసం రైతులను బలి చేస్తున్నారని అన్నారు. సదాశివ నగర్ మండలం, అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన రైతు కుమ్మరి రాజయ్య ఇటీవల చనిపోయాడు. రైతు ఆవేదన యాత్ర రెండో రోజు రాజయ్య కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. దుబాయ్ నుంచి తిరిగొచ్చిన రాజయ్య కుమారుడికి హైదరాబాద్ లో జాబ్ ఇప్పిస్తానని, కూతురు చదువుకు సాయం చేస్తానని షర్మిల హామీ ఇచ్చారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. అన్నదాతలకు టీఆర్ఎస్ చావు డప్పు కొడుతోందన్నారు. కానీ అందరూ కలసి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీకి చావుడప్పు కొట్టాలన్నారు. 

‘ఆమరణ నిరాహార దీక్ష చేసైనా సరే వడ్లు కొనేలా చేస్తా. నా ప్రాణం పోయినా సరే అన్నదాత పక్షాన కొట్లాడతా. కేసీఆర్.. మీ స్వార్థ రాజకీయాల కోసం రైతులను బలి చేస్తారా? చావు డప్పు కొట్టేందుకే మిమ్మల్ని సీఎంను చేశామా? ఏడేళ్లలో ఎంతో మంది రైతులు, నిరుద్యోగులకు చావుడప్పు కొట్టింది మీరు కాదా? వడ్లు కొనని మీకు అధికారం ఎందుకు అని రైతాంగం ప్రశ్నిస్తోంది. మద్దతు ధర ఉన్న పంట వేయొద్దనడానికి మీకు అధికారం ఎక్కడిది?’ అని షర్మిల క్వశ్చన్ చేశారు. 80 వేల పుస్తకాలు చదివానని చెప్పే సీఎంకు.. ఈ నేలల్లో వరి తప్ప ఇంకేం పండదనే విషయం తెలియదా అని ప్రశ్నించారు. వరి వేయమని కేంద్రం దగ్గర ఎవరిని అడిగి సంతకం పెట్టారన్నారు.  

తెలంగాణ రైతులవి ప్రాణాలు కాదా?

‘రెండు నెలల్లో 200 మంది రైతులకు పైసా సాయం చెయ్యలేదు. కానీ హరియాణాలో చనిపోయిన రైతులకు 3 లక్షలు ఇస్తానన్నారు. తెలంగాణ రైతులవి ప్రాణాలు కాదా? రాష్ట్ర రైతాంగం ప్రాణాలకు విలువ లేదా? చనిపోయిన రైతుల కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం ఇవ్వాలి? సీజన్ ఏదైనా వడ్లు కొనాల్సిందే. వరి వద్దన్న సీఎం మనకు వద్దు. వరి కొనాల్సిన బాధ్యత రాష్ట్రానిదే. కేంద్రానికి ఇస్తారా లేదా పక్క రాష్ట్రాలకు ఎగుమతి చేసుకుంటారా అనేది రైతులకు అనవసరం. వడ్లను రా రైస్ చేసుకుంటారా, బాయిల్డ్ రైస్ చేసుకుంటారా అనేది ప్రభుత్వ ఇష్టం’ అని షర్మిల స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తల కోసం: 

క్యాన్సర్తో పోరాడుతున్న టాలీవుడ్ నటి

మీ పొట్టలు నిండాలి.. మా పొట్టలు ఎండాల్నా?

పాండవుల వారసులట.. సోదరిని అత్తారింటికి పంపాలంటే..