యోగా చేస్తే.. యోగ్యులు అవుతరు : వెంకయ్య నాయుడు

యోగా చేస్తే.. యోగ్యులు అవుతరు : వెంకయ్య నాయుడు
  • యోగా.. ఓ థెరపి, మెడిసిన్: వెంకయ్య నాయుడు
  • పని ఒత్తిడికి మంచి రెమిడీ అని కామెంట్
  • యోగా కౌంట్​డౌన్ ప్రోగ్రామ్​కు హాజరు

హైదరాబాద్, వెలుగు: యోగా చేయడం ద్వారా ప్రజలు యోగ్యులు అవుతారని, శారీరక, మానసిక సమస్యలు దూరం అవుతాయని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఈ కాలంలో ఉన్న పని ఒత్తిడికి యోగా ఓ మంచి థెరపి, మెడిసిన్ అని తెలిపారు. ‘నో అటెన్షన్.. నో రిటెన్షన్.. యోగా అన్నింటికి ప్రొటెక్షన్’ అని అన్నారు. హైదరాబాద్​లోని ఎల్బీ స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన యోగా కౌంట్ డౌన్ వేడుకలకు ఆయన హాజరై మాట్లాడారు. ‘‘యోగా అనేది ఒక రోజు ఈవెంట్ కాదు. 

అది మన జీవితంలో ఒక భాగంగా మారాలి. ప్రతిఒక్కరూ యోగా చేయాలి. యోగాతో ఇంద్రియాలను వశం చేసుకుని.. మానసిక శక్తులను ఏకం చేయగలం. ఏకాగ్రత సాధించి ఆత్మశక్తిని మేల్కొల్పవచ్చు. భగవద్గీతలోని ప్రతి అధ్యాయాన్ని ‘యోగం’ అనే పిలుస్తారు’’ అని వెంకయ్య అన్నారు. యోగా చేస్తే మానసికంగా, ఆరోగ్యంగా బాగుంటామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. దీంతో కుటుంబం, సమాజం కూడా హెల్దీగా ఉంటుందని తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రపంచానికి యోగా అనే అద్భుతమైన బహుమతి ఇచ్చారని అన్నారు. 200కు పైగా దేశాలు యోగాను ఆచరిస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, నటులు సాయిధరమ్ తేజ్, ఖుష్బూ, మీనాక్షి చౌదరి, తేజ సజ్జ తదితరులు పాల్గొన్నారు.

నేడు గచ్చిబౌలి స్టేడియంలో యోగా డే

హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శనివారం ఇంటర్నేషనల్ యోగా డే నిర్వహిస్తున్నారు. ఉదయం 6 నుంచి 9 గంటల వరకు జరిగే ఈ ప్రోగ్రామ్​కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. మొత్తం 5వేల మంది పాల్గొనేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా సెక్రటేరియెట్​లో శుక్రవారం ఆయుష్ అధికారులతో మంత్రి దామోదర రాజనర్సింహ రివ్యూ నిర్వహించారు. ఉదయం 6.30 నుంచి 7 గంటల వరకు ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ ప్రసంగం వీక్షించేందుకు ఎల్​ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేశారు.