ఫైలు కదలాలంటే లంచమివ్వాల్సిందే

ఫైలు కదలాలంటే లంచమివ్వాల్సిందే
  • రాష్ట్రంలో పెరిగిపోతున్న అవినీతి..
  • పనులకైనా, పథకాలకైనా.. రేటు ఫిక్స్​చేసి మరీ వసూళ్లు
  • ప్రతి నెలా 20 మంది దాకా అధికారులు, స్టాఫ్ ఏసీబీకి ​దొరుకుతున్నరు
  • లంచగొండుల తాట తీస్తామన్న కేసీఆర్ మాటలు ఉత్తముచ్చట్నే

ఎవరైనా లంచం అడిగితే డొక్క చీరేస్త. అరెస్టు చేయించి జైల్లో తోయిస్త. సందులో మందని పైరవీకారులు, పుండాకోర్లు పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తరు. డబ్బులు గుంజాలని చూస్తరు. అట్లా ఎవరైనా అడిగితే ఇవ్వొద్దు. నాకు ఫోన్‌‌‌‌ చేయండి. నా టోల్‌‌‌‌ఫ్రీ నంబర్‌‌‌‌ 040-–23454071. మీ పేరు, అడ్రస్‌‌‌‌ రాసుకొని అధికారులు యాక్షన్‌‌‌‌ తీసుకుంటరు.
‑ 2015 జనవరిలో హన్మకొండలో కేసీఆర్

హైదరాబాద్, వెలుగు: అవినీతిపరుల తాట తీస్తామన్న సీఎం కేసీఆర్​ హెచ్చరిక ఉత్తముచ్చట్నే అయ్యింది. ప్రభుత్వ శాఖల్లో అవినీతి విపరీతంగా పెరిగిపోతోంది. పథకాలు అందాలన్నా.. ఫైల్‌‌‌‌ కదలాలన్నా.. పని జరగాలన్నా లంచం ఇచ్చుకోవాల్సిన పరిస్థితులున్నాయి. ఒక్కో పనికి ఒక్కో రేటు ఫిక్స్‌‌‌‌ చేసుకొని మరీ దండుకుంటున్నట్టు ఆరోపణలొస్తున్నాయి. రాష్ట్రంలో లంచం తీసుకుంటూ ప్రతి నెలా 15 నుంచి 20 మంది ఏసీబీకి పట్టుబడుతున్నారు. దొరకకుండా తీసుకుంటున్నోళ్లు వందల్లోనే ఉంటారని అంటున్నారు. రిటైర్డ్​ బాస్​అధీనంలో విజిలెన్స్ కమిషన్ ​పని చేస్తుండటంతో మానిటరింగ్​కరువైందని విమర్శలు వినిపిస్తున్నాయి. లంచగొండుల ఇన్ఫర్మేషన్​ కోసం పెట్టిన టోల్​ఫ్రీ నంబర్​2 రోజులకే బందైంది. 

ఏడాదికి 150 మంది అరెస్ట్​
రాష్ట్రంలో ఏడాదికి 150 మంది అవినీతి ఆఫీసర్లు, సిబ్బంది అరెస్టవుతున్నట్టు ఏసీబీ లెక్కలు వివరిస్తున్నాయి. ఏడేండ్లలో 1,065 కేసులు నమోదైనట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో 77.77%  కన్విక్షన్​ రేట్​ఉన్నట్లు చెబుతున్నాయి. ఇవన్నీ కంప్లైంట్​ చేసిన కేసులే. లెక్కల్లోకిరానివి వేల సంఖ్యలోనే ఉంటాయని చర్చ జరుగుతోంది. రిటైరైన ఆఫీసర్లు పెన్షన్, అలవెన్సుల ఫైల్ అప్రూవల్‌కూ లంచం ఇవ్వాల్సిన పరిస్థితులున్నాయి. ఈ ఏడాదిలో మార్క్‌‌ఫెడ్, హాకా ఎండీ సంబంధిత శాఖలో ఓ ఉద్యోగి పెన్షన్ ఫైల్‌కు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు.  

కల్యాణలక్ష్మిలో అక్రమాలు 
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ స్కీమ్‌‌ల అమలులో భారీ అక్రమాలు బయటపడ్డాయి. అనర్హులకు స్కీమ్ వర్తింపజేసేందుకు కొన్ని చోట్ల దళారులతో కలిసి రెవెన్యూ అధికారులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు వసూళ్లకు పాల్పడ్డారు. అప్లికేషన్ పెట్టింది మొదలు డబ్బులు మంజూరయ్యే వరకు ఒక్కో స్టేజ్​లో  రూ. వెయ్యి నుంచి రూ.10 వేల వరకు వసూలు చేశారు. వరంగల్ అర్బన్ (హనుమకొండ), వరంగల్ రూరల్ (వరంగల్), జనగామ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, నల్లగొండ, సూర్యాపేట, ఆదిలాబాద్, నాగర్ కర్నూల్, నిజామాబాద్ జిల్లాల్లో ఇలా అవినీతికి పాల్పడిన 48 మంది రెవెన్యూ అధికారులను విజిలెన్స్ అధికారులు గుర్తించారు. వీళ్లలో వీఆర్ఏలు, వీఆర్వోలు, ఎమ్మార్ఐలు, ఆర్ఐలతోపాటు డిప్యూటీ తహసీల్దార్లు, తహసీల్దార్ స్థాయి అధికారులున్నారు. రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్‌‌లో ఎక్కువ
లంచాల్లో రెవెన్యూ డిపార్ట్‌‌మెంట్​ఫస్ట్​ ప్లేస్​లో ఉంది. వీఆర్వో వ్యవస్థ రద్దు చేసినా వేరే రూపాల్లో లంచాల దందా కొనసాగుతూనే ఉందని విమర్శలున్నాయి. భూ సమస్యలు, ధరణి, కళ్యాణ లక్ష్మి, ఇతర ధ్రువీకరణ పత్రాల వ్యవహారాలు రెవెన్యూ పరిధిలో ఉన్నాయని.. అందుకే ఈ డిపార్ట్‌‌మెంట్‌‌లో ఎక్కువ లంచాలు ముడుతున్నాయని విజిలెన్స్​ఆఫీసర్లు చెబుతున్నారు. మున్సిపల్ శాఖలో బిల్డింగ్స్ పర్మిషన్, లే అవుట్లు, పట్టణాల్లో పథకాలు అందాలంటే లంచాలు తీసుకుంటున్నారని విజిలెన్స్​ రిపోర్టు​ఇచ్చినట్లు తెలిసింది. లంచం అడిగితే ఫోన్​ చేయండి అని హన్మకొండలో సీఎం కేసీఆర్‌‌ చెప్పిన నంబర్​ రెండ్రోజులకే పనిచేయడం మానేసింది. ఆ నంబర్‌‌కు విపరీతంగా కాల్స్ వస్తుండటంతో దాన్ని మార్చేశారు. ప్రతి కంప్లైంట్‌‌ను డిపార్ట్‌‌మెంట్ల వారీగా విభజించి సమస్యలు పరిష్కరించడానికి ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పినా ఈ వ్యవస్థ ఎక్కడ కొనసాగుతుందో ఎవరికీ తెలియదు. ఆఫీసర్లు లంచాలు అడుగుతుంటే ఎవరికి చెప్పుకోవాలో తెలీక జనం తిప్పలు పడుతున్నరు. 

ఓవర్సీస్ స్కాలర్‌‌షిప్‌‌లకూ..
ఆసరా పెన్షన్ల దగ్గర నుంచి కేసీఆర్ ​కిట్, కల్యాణ లక్ష్మి, రేషన్​ కార్డులు, తహసీల్దార్‌‌ ఆఫీసుల్లో ఇన్​కమ్, క్యాస్ట్​సర్టిఫికెట్లకూ లంచాలు తీసుకుంటున్నారని ఆరోపణలున్నాయి. ధరణి వచ్చాక లంచాలు లేవని సర్కారు చెబుతున్నా ఒక్కో రిజిస్ట్రేషన్‌‌కు ఎకరాలను బట్టి రూ. 5 వేల నుంచి రూ. 10 వేల వరకు తహసీల్‌‌ ఆఫీసుల్లో వసూలు చేస్తున్నట్టు చెబుతున్నారు. ఓవర్సీస్​స్కాలర్​షిప్​లకూ లంచాల బెడద తప్పట్లేదు. ఎక్కడైనా డబుల్‌‌ బెడ్రూమ్ ఇండ్లిస్తే అధికార పార్టీ నేతలు, ఆఫీసర్లకు లబ్ధిదారులు లంచం ఇవ్వాల్సి వస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి.