
కరీంనగర్ క్రైం, వెలుగు: కరీంనగర్ బస్టాండ్ లో పర్సు పోయిందని, దొరకకుంటే చస్తానంటూ ఓ యువకుడు ఆదివారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పైకి ఎక్కి హంగామా చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గన్నేరువరం మండలం జంగంపల్లి గ్రామానికి చెందిన చింటూ అలియాస్ రాజు శనివారం రాత్రి కరీంనగర్ బస్టాండ్కు వెళ్లగా గుర్తు తెలియని వ్యక్తులు పర్సు దొంగిలించారు. రాత్రి నుంచి పోలీసులకు చెప్పినా పట్టించుకుంటలేరని పోలీస్స్టేషన్ పైకి ఎక్కి కూర్చున్నాడు. పర్సు దొరకకుంటే దూకి చస్తానని బెదిరించాడు. సిబ్బంది అప్రమత్తమై రాజును కిందికి దింపే ప్రయత్నం చేసినా వినకుండా ఆరగంట పాటు హంగామా చేశాడు. చివరికి అతన్ని మాటల్లో పెట్టి బిల్డింగ్పై నుంచి కిందికి దించారు. రాజు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.