అనంతపురం: వాచ్మెన్, స్వీపర్లకే నిరుద్యోగ యువతను పరిమితం చేయడం దుర్మార్గమని ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అన్న పిలుపు’లో భాగంగా సోమవారం ఆయన అనంతపురంలో తటస్థులతో సమావేశమయ్యారు.
మేం వస్తే 75 శాతం స్థానికులకే
కియా కార్ల పరిశ్రమ వల్ల ఏం ప్రయోజనం లేదని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారని వైఎస్ జగన్ అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలన్నారు. అనంతపురం నిరుద్యోగ యువతను వాచ్మెన్, స్వీపర్ ఉద్యోగాలకే పరిమితం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు వచ్చేలా చట్టం చేస్తామన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలను విస్తృతంగా ఏర్పాటు చేస్తామని, నిరుద్యోగులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు.
ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లను చంద్రబాబు సర్కార్ మూసివేస్తోందని, విద్యార్థులకు సకాలంలో పుస్తకాలు ఇవ్వడం లేదని జగన్ అన్నారు. యూనివర్సిటీల్లో అధ్యాపకుల కొరత సిగ్గు చేటని, రూ. 20 కోట్ల బకాయిలు తనకే రావాలని విద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత, సినీ నటుడు మోహన్ బాబు వంటి వారు ఆవేదన చెందుతున్నారన్నారు. ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోతే కాలేజీలు ఎలా నడుస్తాయని ప్రశ్నించారు.
నేనూ ప్రభుత్వాస్పత్రికి వెళ్లేలా..
ప్రభుత్వ ఆసుపత్రులన్నీ వృథా అన్నట్లు టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, లోకేశ్ కనుసన్నల్లో నడిచే మెడాల్ సంస్థకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో రక్తపరీక్ష కాంట్రాక్టు పనులు అప్పగించి దోపిడీకి పాల్పడుతున్నారని జగన్ ఆరోపించారు. అధికారంలోకి రాగానే వైద్య వ్యవస్థలో సమూల ప్రక్షాళన చేస్తామన్నారు. తాను కూడా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేసుకునే స్థాయికి తీసుకెళ్తానన్నారు. సర్కార్ ఆసుపత్రుల్లో అన్ని మౌళిక సదుపాయాలు కల్పించి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే వైద్యం చేయించుకునేలా వ్యవస్థలో మార్పు తీసుకొస్తామన్నారు.