త్వరలో జరగనున్న హుజూరాబాద్ ఉప ఎన్నికలో YSR తెలంగాణ పార్టీ పోటీ చేయడం లేదు. అయితే.. నిరుద్యోగులతో వందల సంఖ్యలో నామినేషన్లు వేయించాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని తెలుపుతూ ఆ పార్టీ అధినేత్రి షర్మిల ట్వీట్ చేశారు.
ఉద్యోగాల కోసం తెలంగాణ ఉద్యమాన్ని కొట్లాడి నడిపించి 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చింది విద్యార్థులు.. 7 ఏండ్ల తెలంగాణలో మళ్లీ ఉద్యోగాల నోటిఫికేషన్స్ కోసం మరో ఉద్యమాన్ని మొదలు పెట్టింది YSRTP అని అన్నారు షర్మిల.
రాష్ట్రంలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని.. నోటిఫికేషన్లు జారీ చేయడంలో ఆలస్యం విమర్శించారు షర్మిల. నోటిఫికేషన్లు రేపు, మాపు విడుదల చేస్తామంటూ మభ్యపెడుతోందని విమర్శించారు. సీఎం కేసీఆర్కు గుణపాఠం చెప్పేందుకు, ఆయన మెడలు వంచడానికే హుజూరాబాద్ ఉప ఎన్నికలో నిరుద్యోగులతో నామినేషన్లు వేయించాలని పార్టీ నిర్ణయించినట్లు తెలిపారు. పూర్తి స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేసే వరకూ యువత పక్షాన నిలబడుతామని చెప్పారు షర్మిల.