కేసీఆర్ సీఎంగా ఉన్నంత కాలం రైతుకు శాపం : షర్మిల

కేసీఆర్ సీఎంగా ఉన్నంత కాలం రైతుకు శాపం : షర్మిల

సీఎం కేసీఆర్ పై వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. తొమ్మిదేళ్ల  కేసీఆర్ పాలనలో బీఆర్ఎస్ నాయకులు తప్ప ఏ ఒక్క వర్గం బాగుపడలేదని విమర్శించారు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలని షాద్ నగర్ లో  ధర్నా చేస్తున్న ప్రతిపక్షాలు, రైతు సంఘాలకు షర్మిల మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. కేసీఆర్ ది పరిపాలనా అనాలా? లేక దిక్కుమాలిన పాలనా అనాలా? అని ప్రశ్నించారు. కేసీఆర్ లాంటి వ్యక్తి పందిరేస్తే కుక్కతోక తాకి కూలిపోయిందంటా అని సెటైర్లు వేశారు. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు కడితే మూడు నెలలకే మునిగిపోయిందన్నారు షర్మిల. 

కాంట్రాక్టర్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని కేసీఆర్  లక్ష కోట్లకు పెంచిండని ఆరోపించారు షర్మిల.  కేసీఆర్ ..  కమీషన్ల చంద్రశేఖర్ రావుగా పేరు మార్చుకోవాలని సూచించారు.   కమీషన్ల కోసమే కేసీఆర్ ప్రాజెక్టులను రీ డిజైన్  చేశారని ఆరోపించారు. కమీషన్ల కోసమే  రాష్ట్రంలోని  అన్ని ప్రాజెక్టులను కాంట్రాక్టర్ మెఘా కృష్ణారెడ్డికి కట్టబెడుతున్నారని వెల్లడించారు.  పాలమూరు, మిషన్ భగీరథ ఇలా అన్ని కాంట్రాక్టులు మెఘా కృష్ణారెడ్డికే ఇస్తున్నారని..  ఎందుకంటే మెఘా కృష్ణారెడ్డి కేసీఆర్ కు కమీషన్ ఇస్తారని ఆరోపించారు.  

రాష్ట్రంలో పథకాలకు పైసలుండవు కానీ ప్రాజెక్టులకు పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయని షర్మిల ప్రశ్నించారు. ప్రాజెక్టులకైతే కాంట్రాక్టర్ల దగ్గర నుంచి కేసీఆర్ కు కమీషన్ వస్తుందని.. పథకాల అమలుకైతే కమీషన్ రాదన్నారు.  రాష్ట్రం అప్పుల పాలైతే బీఆర్ఎస్ అకౌంట్లోకి  కోట్లకి కోట్లు ఎలా వచ్చాయన్నారు.  

కేసీఆర్ సీఎంగా ఉన్నంత కాలం రైతుకు శాపమని..పాలమూరు, లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ నిర్మాణం పూర్తి కాదన్నారు. సర్కార్ మారితేనే రైతులు బాగుపడ్తారని.. ఉద్యోగాలొస్తాయని చెప్పారు.  ప్రజలంతా ఏకమై కేసీఆర్ కు వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికైనా కేసీఆర్ స్పందించి లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.