ఒంటరినయ్యా.. నా కన్నీరు ఆగనంటోంది!

ఒంటరినయ్యా.. నా కన్నీరు ఆగనంటోంది!

ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆయన కుమార్తె, వైఎస్‌ఆర్‌‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నివాళి అర్పించారు. వైఎస్‌ఆర్ 12వ వర్ధంతి సందర్భంగా ఏపీలోని కడప జిల్లా ఇడుపులపాయలో ఉన్న తండ్రి సమాధి వద్ద గురువారం నాడు కుటుంబసభ్యులు ప్రత్యేక పార్ధనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం వైఎస్ జగన్‌, భారతి, షర్మిల, వైఎస్ విజయమ్మ, ఇతర కుటుంబసభ్యులు, అభిమానులు పాల్గొన్నారు. కాగా ఈ వర్ధంతి సందర్భంగా వైఎస్ షర్మిల చేసిన ట్వీట్ ఇప్పుడు మీడియా, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. అంతేకాదు గత కొన్ని రోజులుగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో షర్మిలకు ఉన్న విబేధాలు అక్షరాలా నిజమయ్యేలా ఆ ట్వీట్ ఉండటం గమనార్హం.

ఒంటరినయ్యా..!

‘ఒంటరి దానినైనా విజయం సాధించాలని.. అవమానాలెదురైనా ఎదురీదాలని.. కష్టాలెన్నైనా ధైర్యంగా ఎదుర్కోవాలని.. ఎప్పుడూ ప్రేమనే పంచాలని, నా వెన్నంటి నిలిచి, ప్రోత్సహించి నన్ను మీ కంటిపాపలా చూసుకొన్నారు. నాకు బాధొస్తే మీ కంట్లోంచి నీరు కారేది.. ఈ రోజు నా కన్నీరు ఆగనంటుంది. ఐ లవ్ & మిస్ యూ డాడీ’ అని షర్మిల ట్వీట్ చేశారు.  అంటే తాను ఒంటరిని అయ్యానని ఈ ట్వీట్ రూపంలో వైఎస్ షర్మిల చెప్పేశారు. దీన్ని బట్టి చూస్తే.. సోదరుడు జగన్‌తో మనస్పర్థలున్నాయన్న విషయం ఎవరికైనా స్పష్టంగానే అర్థమైపోతుంది. ఈ ట్వీట్  ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కూడా చర్చనీయాంశమవుతోంది..

పక్కపక్కనే ఉన్నప్పటికీ..!

వైఎస్సార్ జయంతి రోజున, రాఖీ పండుగ రోజున కూడా అన్నా, చెల్లి ఇద్దరూ కలవలేదు. దీంతో అప్పట్లో మీడియాలో పెద్ద చర్చే జరిగింది. అయితే తాజాగా ఇద్దరూ ఇడుపులపాయలో కలుసుకున్నప్పటికీ.. అంతేకాదు ఇద్దరూ పక్కపక్కనే ఉన్నప్పటికీ ఒకర్ని ఒకరు పలకరించకోకపోవడం గమనార్హం. ఇవాళ్టితో ఇద్దరి మధ్య ఉన్న విబేధాలకు ఫుల్‌స్టాప్ పడుతుందని, కచ్చితంగా ఇద్దరూ మాట్లాడుకుంటారని ఇన్ని రోజులుగా వస్తున్న పుకార్లకు ఫుల్ స్టాప్ పడుతుందని అభిమానులు, వైఎస్ అనుచరులు అనుకున్నప్పటికీ అవేమీ అస్సలు జరగలేదు.

ప్రతి అడుగులోనూ, ప్రతి ఆలోచనలోనూ..

“నాన్న భౌతికంగా దూరమై 12ఏళ్లయినా జనం మనిషిగా, తమ ఇంట్లోని సభ్యునిగా నేటికీ జ‌న హృద‌యాల్లో కొలువై ఉన్నారు.చిరునవ్వులు చిందించే ఆయన రూపం, ఆత్మీయ పలకరింపు మదిమదిలోనూ అలానే నిలిచి ఉన్నాయి. నేను వేసే ప్రతి అడుగులోనూ, చేసే ప్రతి ఆలోచనలోనూ నాన్న స్ఫూర్తి ముందుండి నడిపిస్తోంది. #YSRForever” అని ఏపీ సీఎం వైఎస్ జగన్ ట్వీట్‌ చేశారు.