తీహార్ జైలు నుంచి ప్రభుత్వాన్ని నడిపేందుకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు తగిన సౌకర్యాలు కల్పించాలని, అలాగే సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేయకుండా రాజకీయ ప్రత్యర్థులను నిలువరించాలని, వాటిని ప్రసారం చేయకుండా అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వేసిన పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. అంతేకాకుండా పిటిషనర్ న్యాయవాది శ్రీకాంత్ ప్రసాద్కు హైకోర్టు రూ.లక్ష జరిమానా విధించింది.
తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్ మరియు జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరాలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ పిటిషన్ను విచారించింది, ఈ సందర్భంగా న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తంచేసింది. మేం ఎమర్జెన్సీ విధించాలా? మార్షల్ చట్టాన్ని అమలుచేయాలా? రాజకీయ ప్రత్యర్థులు చేసుకునే వ్యాఖ్యలను ప్రసారం చేయకుండా మేం మీడియాపై సెన్సార్షిప్ ఎలా విధించగలం? అని ప్రశ్నించింది.
కాగా ఢిల్లీ లిక్కుర్ స్కామ్ కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్ను మార్చి 21న అరెస్టు చేసింది ఈడీ. ప్రస్తుత జ్యుడీషియల్ కస్టడీలో తీహార్ జైలులో ఉన్నారు. ఇక ఈ కేసులో కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తే.. సీఎం బాధ్యతల్లో అధికారిక విధులు నిర్వర్తించేందుకు అనుమతించబోమని ధర్మాసనం స్పష్టం చేసింది. బెయిల్పై విడుదలైతే ఫైళ్లపై సంతకాలు చేయొద్దని తెలిపింది.