- గత రెండేండ్లలో వృథా అయింది రూ.9 లక్షల మందులే
- బదులుగా కాంట్రాక్టర్తో కొత్త మెడిసిన్ సప్లై చేయించాం
- మంత్రి దామోదరకు రిపోర్ట్ ఇచ్చిన టీజీఎంఎస్ఐడీసీ అధికారులు
హైదరాబాద్,- వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్పిటల్స్ లో కొనుగోలు చేసిన మందుల విషయంలో గత బీఆర్ఎస్ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసిందని టీజీఎంఎస్ఐడీసీ(తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్) రిపోర్ట్లో వెల్లడైంది. 2017 నుంచి 2023 వరకు రూ.88 కోట్ల విలువైన మెడిసిన్ఎక్స్పైర్అయిందని తేలింది. బుధవారం సెక్రటేరియట్ లో మెడికల్ కార్పొరేషన్ అధికారులు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు మందుల కొనుగోలు, వృథాపై రిపోర్ట్ఇచ్చారు.
గత ప్రభుత్వంలో సుమారు రూ.2,700 కోట్ల విలువైన మందులు కొనుగోలు చేయగా.. ఇందులో ఏకంగా రూ.88 కోట్ల మెడిసిన్వృథాగా పోయినట్లు తెలిపారు. ముఖ్యంగా 2021-–23 మధ్య కాలంలో ఈ నష్టం ఎక్కువగా ఉందని లెక్కలు చెప్తున్నాయి. 2021లో రూ.26 కోట్లు, 2022లో రూ.27 కోట్లు, 2023లో రూ.12 కోట్లు విలువైన మందులు కాలం చెల్లిపోయి, పనికి రాకుండా పోయాయని రిపోర్ట్లో పేర్కొన్నారు.
రెండేండ్లుగా పకడ్బందీ చర్యలు
రాష్ట్రంలో రెండేండ్లుగా మందుల సరఫరాలో పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని అధికారులు మంత్రికి వివరించారు. సుమారు రూ.1,000 కోట్ల విలువైన మెడిసిన్ కొనుగోలు చేయగా.. ఇందులో రూ.9 లక్షల విలువైన మందులు మాత్రమే ఎక్స్ పైరీ అయ్యాయని తెలిపారు. అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు వృథాను అరికట్టగలిగామని స్పష్టం చేశారు. ఇందుకోసం రివర్స్ మెకానిజంను అమలు చేస్తున్నట్లు చెప్పారు.
ఏదైనా హాస్పిటల్లో మందులు ఎక్స్ పైరీ అవడానికి 3 నెలల ముందే వాటిని వెనక్కి తెప్పించి, అవసరమున్న ఇతర హాస్పిటల్స్ కు పంపిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒకవేళ మందులు కాలం చెల్లిపోతే.. ఆ నష్టాన్ని సప్లై చేసిన సంస్థే భరించేలా టెండర్ నిబంధనలు మార్చామన్నారు. ఇప్పటివరకు వృథా అయిన రూ. 9 లక్షల విలువైన మందులకు బదులుగా.. కాంట్రాక్టర్తో మాట్లాడి ఉచితంగా అంతే విలువైన కొత్త మందులను సరఫరా చేయించినట్లు తెలిపారు.

