సాంస్కృతిక, వారసత్వ ఆస్తుల పరిరక్షణలో ఇండియాకు అతిపెద్ద విజయం లభించింది. భారత్ నుంచి దొంగిలించిన కోట్ల విలువైన విగ్రహాలను స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న అమెరికా.. ఇండియాకు అప్పగించింది.. మాన్హాటన్ జిల్లా ఆటర్నీ కార్యాలయం.. మొత్తం 657 వస్తువలను భారత్ కు తిరిగి ఇచ్చింది. ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ దర్యాప్తులో భాగంగా పురాతన విగ్రహాలు, కళా ఖండాలు భారత్ కు చెందినవిగా అంగీకరించిన అమెరికా.. వాటిని అప్పగించింది.
అంతర్జాతీయ స్మగ్లర్ సుభాష్ కపూర్, డీలర్ నాన్సీ వియెనర్ పై సుదీర్ఘ విచారణ తర్వాత.. ఇండియా నుంచి దొంగిలించిన వస్తువులుగా నిర్ధారించిన అటార్నీ కార్యాలయం.. ఇండియా కాన్సులేట్ జనరల్ అధికారులకు అప్పగించారు.
విలువైన అవలోకితేశ్వర, బుధ్ద, గణేష్ కళాఖండాలు:
అమెరికా ఇండియాకు అప్పగించిన విగ్రహాలు, కళాఖండాలలో శతాబ్దాల చారిత్రకు సాక్ష్యాలుగా నిలిచిన వస్తులు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి..
- కంచు అవలోకితేశ్వరుడు:
రాయ్పూర్లోని మహంత్ ఘాసిదాస్ మెమోరియల్ మ్యూజియం నుంచి దొంగిలించిన విగ్రహం ఇది. దీని విలువ 19 కోట్ల వరకు ఉంటుంది. దీన్ని 1982 నాటికి అమెరికాకు అక్రమంగా తరలించారు. 2025లో ఒక ప్రైవేట్ కలెక్షన్ నుంచి స్వాధీనం చేసుకున్నారు.
- ఎర్ర ఇసుకరాయి బుద్ధుడు:
71 కోట్ల రూపాయల విలువైన ఈ విగ్రహాన్ని సుభాష్ కపూర్ నెట్వర్క్ ద్వారా అమెరికాకు తరలించారు. న్యూయార్క్లోని ఒక స్టోరేజ్ కేంద్రం నుంచి స్వాధీనం చేసుకున్నారు.
- నాట్య గణేశుడు:
2000 సంవత్సరంలో మధ్యప్రదేశ్లోని ఒక ఆలయం నుంచి దోచుకోబడిన ఇసుకరాయి శిల్పం ఇది. దీనిని ఫోర్జరీ డాక్యుమెంట్స్ ద్వారా అమ్మడమే కాకుండా, 2012లో క్రిస్టీస్ సంస్థలో వేలం వేశారు.
- ప్రపంచవ్యాప్త అక్రమ రవాణాపై ఉక్కు పాదం:
సుభాష్ కపూర్ స్మగ్లింగ్ వ్యవహారాలపై10 సంవత్సరాలకు పైగా, పురావస్తు అక్రమ రవాణా విభాగం (ATU) , హోంల్యాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్ (HSI) దక్షిణ, ఆగ్నేయాసియా అంతటా ఆపరేషన్ చేపట్టాయి. 2022లో ఇండియాలో దోషిగా నిర్ధారించిన కపూర్ ను, ప్రస్తుతం అమెరికాకు అప్పగిస్తున్నారు.
సాంస్కృతికంగా అత్యంత కీలకమైన ఈ వస్తువులను గుర్తించడంలో అపారమైన కృషి చేసిన అమెరికా అధికారులకు కాన్సుల్ జనరల్ బినయ ప్రధాన్ కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటివరకు, ఏటీయూ (ATU) దాదాపు 485 మిలియన్ డాలర్ల విలువైన 6,200కు పైగా వస్తువులను స్వాధీనం చేసుకుని, వాటిని 36 వేర్వేరు దేశాలకు తిరిగి అప్పగించింది.

