ఈటలను గెలిపిస్తే కేసీఆర్ దిగొచ్చి దళితులందరికీ 3 ఎకరాలిస్తాడు

 ఈటలను గెలిపిస్తే కేసీఆర్ దిగొచ్చి దళితులందరికీ 3 ఎకరాలిస్తాడు
  • ఎన్నికల ముందు మాయమాటలు చెప్పే కేసీఆర్ ఎన్నికలయ్యాక అన్నీ మర్చిపోతాడు
  • జమ్మికుంట దళిత ఆత్మగౌరవ సభలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి

హుజూరాబాద్: ఈ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ ను గెలిపిస్తే.. సీఎం కేసీఆర్ దిగివచ్చి దళితులందరికీ మూడెకరాల భూమి ఇస్తాడని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. అబద్ధాల ముఖ్యమంత్రి కేసీఆర్ ఉప ఎన్నికల్లో మాయమాటలు చెప్పి.. ఎన్నికలయ్యాక అన్నీ మర్చిపోతాడని ఆయన హెచ్చరించారు. ఇద్దరు దళిత ఉప ముఖ్యమంత్రులు ఉన్నప్పటికీ పక్కన పెట్టారని ఆయన ఆరోపించారు. గురువారం జమ్మికుంటలో బీజేపీ దళిత మోర్చా సమావేశంలో వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ ఈటల రాజేందర్ విజయం కోసం దళితులంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ దళితుల ద్రోహి అని ఇప్పటికే అనేక మంది చెప్పారని ఆయన గుర్తు చేశారు. 
దళితుడ్ని రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీదే 
కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ 12 మంది దళితులను మంత్రివర్గంలోకి తీసుకున్నారని, దళిత వ్యక్తిని రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానికే దక్కుతుందని వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. కేసీఆర్ మాత్రం ఒకే దళిత వ్యక్తిని రాష్ట్ర  కేబినెట్ లోకి తీసుకున్నారని ఆయన విమర్శించారు. తన కుటుంబం నుంచి కొడుకు, అల్లుడు సహా ఆరుగురు బంధువులకు కేబినెట్ హోదా ఇచ్చుకున్నాడని ఆయన ఆరోపించారు. చివరకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్లుగా తన కుటుంబంలోని ఆరుగురికి అవకాశం ఇప్పించిన కేసీఆర్.. ఒక్క దళితుడికి కూడా అవకాశం కల్పించలేదని గుర్తు చేస్తూ.. కేసీఆర్ కు దళితులపై ఎక్కడ ప్రేమ ఉంది ? అని ప్రశ్నించారు.
తన తర్వాతైనా దళితుడ్ని సీఎం చేస్తాననడం లేదు  
దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని మాట తప్పిన కేసీఆర్.. కనీసం.. తన తర్వాతైనా దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పడం లేదని వివేక్ వెంకటస్వామి అన్నారు. మూడెకరాలు ఇస్తానని కేసీఆర్ చెప్పినప్పుడు ఐదులక్షలకు ఎకరా కొనిస్తానన్నాడని, 50 వేల కోట్లతో భూమి కొనిస్తానని అబద్ధాలు చెప్పాడని ఆయన గుర్తు చేశారు. దళితుల్లో ఎక్కువగా కౌలు రైతులే ఉంటారని, కానీ రైతుబంధు కౌలు రైతులకు  ఇవ్వడం లేదని ఆయన పేర్కొన్నారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్ లో పంట నష్టపోయిన రైతులతో మాట్లాడాను... వాళ్లంతా కౌలురైతులే.. దళిత కౌలు రైతులకు ఎందుకు రైతుబంధు ఇవ్వరని ప్రశ్నించానన్నారు. కేసీఆర్ ఎప్పటికీ దళితులకు వ్యతిరేక కార్యక్రమాల గురించే ఆలోచిస్తారని, 
అప్పుడే మూడెకరాల భూమి ఇచ్చి ఉంటే వాటి విలువ 50 లక్షలు ఉండేది, అలాగే డబుల్ బెడ్ రూం ఇస్తే దాని విలువ 15 లక్షలు ఉండేదని వివరించారు. 
దళితులను మరోసారి మోసం చేసేందుకే దళిత బంధు
ఈటలను ఓడించేందుకు, దళితులను మభ్యపెట్టేందుకు మరోసారి మోసం చేయడానికి దళితబంధు ప్రకటించారని వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. పది లక్షలు డబ్బులు వేసినట్లే వేసి... అకౌంట్లు ఫ్రీజ్ చేసారని, మన ఓట్ల కోసమే కేసీఆర్ ఇలాంటివన్నీ చేస్తున్నారని ఆరోపించారు. ఈటల రాజేందర్ ను గెలిపిస్తామని అందరూ చేతులెత్తాలని వివేక్ వెంకటస్వామి కోరగా.. సభికులందరూ చేతులు ఎత్తి ఈటలను గెలిపిస్తామని అన్నారు.