- హైదరాబాద్లో ఓవర్సీస్కన్సల్టెన్సీపై కేసు నమోదు
జూబ్లీహిల్స్, వెలుగు: యూకే స్కిల్డ్ వర్క్ వీసా ఇప్పిస్తామని రూ.31.42 లక్షలు వసూలు చేసి మోసం చేయడంపై ఓవర్సీస్ కన్సల్టెన్సీ ప్రతినిధులపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. హైదరాబాద్ ఫిల్మ్నగర్ రోడ్ నం.8 లో నివసిస్తున్న దీపిక కరింగుల(30) యూకే వెళ్లేందుకు వర్క్ వీసా కోసం ఆరెన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీని సంప్రదించింది. గతంలో యూకే ఇమ్మిగ్రేషన్ చరిత్ర ఉన్నప్పటికీ, దానివల్ల ఎలాంటి సమస్య ఉండదని, యూకే స్కిల్డ్ వర్క్ వీసా ఇప్పిస్తామని కన్సల్టెన్సీ ప్రతినిధులు హామీ ఇచ్చారు.
వీసా ప్రాసెసింగ్, సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్షిప్ తదితర ఖర్చుల పేరుతో రూ.31,42,000 లక్షలు తీసుకున్నారు. కాగా వీసా దరఖాస్తు సమయంలో ఫిర్యాదుదారుకు సంబంధించిన ఆరు నెలల ఓవర్స్టే వివరాలను దాచిపెట్టడంతో వీసా రిజెక్ట్అయింది. దీంతోపాటు 10ఏండ్లపాటు యూకేలో ప్రవేశించకుండా దీపికను బ్యాన్చేశారు. ఈ విషయాన్ని కన్సల్టెన్సీ ప్రతినిధులు రెండు నెలల పాటు ఆమెకు తెలియజేయలేదు. ఈ ఘటన వల్ల తనకు ఆర్థిక నష్టంతో పాటు ఇమ్మిగ్రేషన్ రికార్డుకు నష్టం వాటిల్లిందని, విదేశాల్లో ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయని బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఆరెన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ ప్రతినిధులు దీప్తి, రూఫస్ వెలేటిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
