సాగునీటి వనరులను ఉపయోగించుకోవాలి : వినోద్ శేషన్

సాగునీటి వనరులను ఉపయోగించుకోవాలి : వినోద్ శేషన్
  • కేంద్ర సహజ వనరుల సంయుక్త కార్యదర్శి వినోద్ శేషన్

ఆసిఫాబాద్, వెలుగు: జిల్లాలోని సాగునీటి, తాగునీటి వనరులను సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర పెట్రోలియం, సహజ వనరులు, గ్యాస్ సంయుక్త కార్యదర్శి వినోద్ శేషన్ సూచించారు. మంగళవారం ఆసిఫాబాద్ ​కలెక్టరేట్​లో కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధాశుక్లాతో కలిసి నీటిపారుదల, మిషన్ భగీరథ, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో సాగునీటి వనరుల రక్షణ, నీటి వినియోగం, తాగునీటి వనరుల ద్వారా ఇంటింటికీ నీరు అందించడం, అంగన్వాడీ కేంద్రాలు, స్కూళ్లకు శుద్ధమైన నీటిని సరఫరా చేయడం వంటి అంశాలపై రివ్యూ నిర్వహించారు. 

ఆయన మాట్లాడుతూ జిల్లాలోని చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల ద్వారా సాగు భూములకు నీరందించి వ్యవసాయ రంగ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. సాగునీటి వనరుల ద్వారా మత్స్య సంపదను కూడా పెంపొందించుకుంటే ఆర్థికాభివృద్ధి సాధించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి గ్రామంలోని ఇంటింటికీ, అంగన్వాడీ కేంద్రాలకు, పాఠశాలలకు శుద్ధ జలాన్ని అందించాలని, ప్రతి వర్షపు నీటిబొట్టును నిల్వ చేసుకోవాలని సూచించారు. జగన్నాథ్​పూర్ ప్రాజెక్టు పెండింగ్ పనులపై నివేదిక రూపొందించి నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు.

 కలెక్టర్ ధోత్రే మాట్లాడుతూ జిల్లాలో ఒక భారీ నీటిపారుదల ప్రాజెక్టు, 3 మధ్య తరహా ప్రాజెక్టులు, 574 చెరువులు, కుంటలు, 13 లిఫ్ట్ ఇరిగేషన్ల ద్వారా సాగునీటిని అందించేందుకు కృషి చేస్తున్నా మని తెలిపారు. అంతకుముందు కేంద్ర బృందం గుండి గ్రామాన్ని సందర్శించి ఇండ్లు, అంగ న్వాడీ కేంద్రాలు, స్కూళ్లకు శుద్ధ జలం అందిస్తున్న తీరును పరిశీలించారు.