పుట్టినరోజు అంటేనే పిల్లలకి చెప్పలేని సంతోషం. అందులోనూ వాళ్లకు నచ్చిన థీమ్తో కేక్ ఉంటే ఆ రోజంతా పండగే. కానీ, మహారాష్ట్రలోని థానేలో ఒక మూడేళ్ల చిన్నారి పుట్టినరోజు కేక్ ఆ కుటుంబానికి ఒక పెద్ద పీడకలగా మారింది. కేక్లోని ఒక చిన్న వస్తువు ఆ పిల్లాడి ప్రాణాల మీదకు తెచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ షాకింగ్ స్టోరీ ఏంటంటే...
ఇన్స్టాగ్రామ్లో ఓ మహిళా తన కొడుకు రేయాన్ష్ మూడో పుట్టినరోజున జరిగిన ఘోరాన్ని సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది. ఆమె కొడుకు కోసం బౌలింగ్ థీమ్ ఉన్న ఒక కేక్ను థానేలోని బేకరీలో ఆర్డర్ చేశారు. కేక్ చూడగానే ఆ చిన్నారి ఎంతో ముచ్చటపడ్డాడు. కానీ, ఆ బేకరీ వాళ్లు కేక్ పైన ఉన్న బొమ్మలు నిలబడటం కోసం, కేక్ లోపల మెటల్ తీగలను (Metal Wires) వాడారు. ఆ విషయం తెలియక ఆ తల్లి కొడుక్కి కేక్ తినిపించింది. అంతే.. ఆ రెండేళ్ల పసివాడు కేక్తో పాటు ఆ మెటల్ తీగ ముక్కలను కూడా మింగేశాడు.
మే 31న నా కొడుకు పుట్టినరోజు ముందు రోజు వేడుక చాలా గ్రాండ్గా చేసుకున్నాం. తీరా జూన్ 1న వాడి అసలైన పుట్టినరోజున ఆసుపత్రిలో ఉన్నాం" అంటూ ఆ తల్లి కన్నీళ్లతో తన ఆవేదనను చెప్పుకుంది.
ఎక్స్-రేలో చూసి షాకై..
కడుపునొప్పితో బాధపడుతున్న ఆ బాబును ఆసుపత్రికి తీసుకెళ్లి ఎక్స్-రే తీయించగా.. పేగుల్లో రెండు లోహపు తీగ ముక్కలు ఉన్నట్లు తేలింది. డాక్టర్లు ఆ బాబును అబ్జర్వేషన్లో పెట్టారు. అదృష్టవశాత్తూ, ఎలాంటి సర్జరీ అవసరం లేకుండానే 48 గంటల తర్వాత ఆ లోహపు ముక్కలు బాబు శరీరం నుండి మలం ద్వారా బయటకు వచ్చేశాయి. దాంతో ఆ తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
►ALSO READ | నేను వద్దంటే ప్రాజెక్టులు ఆగవ్.. సీఎం రేవంత్ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్
ఈ అనుభవం తర్వాత ఆ తల్లి ఇతర తల్లిదండ్రులకు ఒక సలహా ఇచ్చింది. బేకరీల్లో కేక్ ఆర్డర్ చేసినప్పుడు.. పైన ఉండే డెకరేషన్ పూర్తిగా తినేటివేనా ?, వాటిని నిలబెట్టడానికి లోపల టూత్పిక్లు, ప్లాస్టిక్ లేదా మెటల్ వైర్లు వాడారా ? అని బేకర్లను కచ్చితంగా అడిగి తెలుసుకోండి అని సూచించింది.
అలర్ట్ అయిన FSSAI
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కేంద్ర ఆహార భద్రతా సంస్థ (FSSAI) వెంటనే రంగంలోకి దిగింది. జూన్ 12న దేశంలోని అన్ని బేకరీలు, హోటళ్లు, ఫుడ్ బిజినెస్ సంస్థలకు (FBOs) అత్యవసర ఆదేశాలు జారీ చేసింది.
FSSAI పెట్టిన స్ట్రిక్ట్ రూల్స్ ఇవే:
* కేకుల పైన, లోపల డెకరేషన్ కోసం ఎలాంటి లోహపు తీగలు, పిన్నులు వాడకూడదు.
* స్వీట్ బాక్సులు, కేక్ బాక్సులు, బిర్యానీ పార్సిళ్లు, స్నాక్ పౌచ్లు, టేక్అవే ఫుడ్ ప్యాకెట్లను సీల్ చేయడానికి స్టేప్లర్ పిన్నులు లేదా మెటల్ వైర్లు అస్సలు ఉపయోగించకూడదు.
* తినేటప్పుడు కస్టమర్లు పొరపాటున వీటిని మింగితే ప్రాణాలకే ప్రమాదం. కాబట్టి ఈ రూల్స్ ఉల్లంఘిస్తే 'ఫుడ్ సేఫ్టీ యాక్ట్ 2006' ప్రకారం కఠినమైన జరిమానాలు, జైలు శిక్ష వంటి చర్యలు ఉంటాయని హెచ్చరించింది.
