షాద్ నగర్,వెలుగు: రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలో ఈ నెల 26న అలైన్ హెర్బల్ ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాద ఘటనలో ఆరుగురి ప్రాణాలు కాపాడిన నందిగామకు చెందిన సాయి చరణ్ ను సీఎం రేవంత్రెడ్డి సన్మానించారు. ప్రమాదం జరిగిన సమయంలో ధైర్య సాహసాలు ప్రదర్శించిన విషయం తెలుసుకున్న సీఎం ఆదివారం హైదరాబాద్ లోని తన నివాసానికి పిలిపించుకొని శాలువాతో సన్మానించి అభినందించారు.
ప్రతి ఒక్కరూ సాయి చరణ్ ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ప్రమాద సమయంలో తమకు తోచిన సాయం చేసి మానవత్వం చాటుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తదితులులు ఉన్నారు.