- ఇందుకోసం ఆగస్టు మొదటి వారంలో అసెంబ్లీ, మండలి సమావేశాలు
- కేంద్రం ఆమోదించేలా రాహుల్, ఖర్గేలతో ఒత్తిడి పెంచుతం
- ప్రధాని మెడలు వంచి ప్రధాన్తో రాజీనామా చేయించిన ఘనత జెన్జీదే
- ఈ విజయం ముమ్మాటికీ మీదే..
- ఈ సునామీని ఇంతటితో ఆపొద్దు
- రాహుల్ ప్రధాని అయితే జెన్ జీ నుంచే కేంద్ర విద్యా శాఖ మంత్రి ఉండేలా చూస్తామని హామీ
- ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జీ, కేంద్రం తీరుకు నిరసనగా పీసీసీ ఆధ్వర్యంలో భారీ క్యాండిల్ ర్యాలీ
- పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, పలువురు మంత్రులు
హైదరాబాద్, వెలుగు: ఈ దేశ భవిష్యత్తును నిర్దేశించే యువతకు 21 ఏండ్లకే ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘21 ఏండ్లకే ఐఏఎస్, ఐపీఎస్లాంటి సివిల్ సర్వీసులకు యువతీ యువకులు ఎంపికైతున్నరు.. మరి ఇదే వయస్సు ఉన్న యువత చట్ట సభల్లో అడుగుపెట్టి తమ గళం ఎందుకు వినిపించొద్దు? అందుకే అసెంబ్లీ, లోక్ సభకు పోటీచేసే వారి వయస్సును 25 నుంచి 21 ఏండ్లకు తగ్గించాలి.. ఇందుకోసం ఆగస్టు మొదటి వారంలో అసెంబ్లీ, శాసన మండలి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటుచేసి ఎమ్మెల్యే, ఎంపీగా పోటీకి కనీస వయస్సును 21 ఏండ్లకు తగ్గించాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తాం’’ అని పేర్కొన్నారు.
పార్లమెంట్లో ఈ బిల్లును ఆమోదించేలా రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఒత్తిడి పెంచుతారని పేర్కొన్నారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద స్టూడెంట్లపై లాఠీచార్జీ, కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా పీసీసీ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరా గాంధీ విగ్రహం వరకు భారీ క్యాండిల్ ర్యాలీ తీశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న విద్యార్థులు, యువతను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.
‘‘జెన్ జీలు విద్యాశాఖ, ఐటీ శాఖల మంత్రులుగా ఉంటేనే దేశం ముందుకుపోతుంది. రాహుల్ ప్రధాని అయితే కేంద్రంలో జెన్జీ నుంచి ఒకరిని కేంద్ర విద్యా శాఖ మంత్రిగా నియమించే బాధ్యతను నేను తీసుకుంటాను. దీనిపై ఇండియా కూటమితో మాట్లాడుతాను. ప్రపంచానికి జెన్ జీ గళం వినిపించాలి. ఆ దిశగా మేం పనిచేస్తాం” అని వ్యాఖ్యానించారు.
ఈ సునామీని కొనసాగించాలి..
పార్లమెంట్లో జెన్ జీ ప్రాతినిధ్యం ఒక్క శాతం లోపే ఉందని, 30 శాతం ఉన్న జెన్ జీలకు చట్టసభల్లో ఆ మేరకు అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు.‘‘మోదీని, కేంద్రాన్ని మీ గుండె ధైర్యంతో ఎదుర్కొన్నారు. లాఠీలు, తూటాలకు ఎదురొడ్డి నిల్చొని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో రాజీనామా చేయించారు. మీరు చేస్తున్న ఈ పోరాటానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా.
ఈ సునామీని ఇంతటితో ఆపొద్దు. ఇక్కడకు వచ్చిన విద్యార్థులు, యువ మిత్రుల ముఖాల్లో విజయదరహాసం నాకు కనిపిస్తోంది. జెన్ జీ యువత పోరాటం ముందు 56 ఇంచుల ఛాతి తలవంచి, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించారు. కానీ ఇది సరిపోదు. నీట్ పరీక్ష పత్రాలు లీక్ కావడంతో ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం ఇవ్వలేదు. పోరాటంలో విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేయలేదు.
కేంద్ర ప్రభుత్వం పరీక్షా నిర్వహణలో విఫలం కావడం వల్ల అనేక మంది విద్యార్థులు నష్టపోయారు. వీటన్నింటినీ సాధించే వరకు మీ పోరాటాన్ని ఆపొద్దు” అని సూచించారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే , కాంగ్రెస్తోపాటు ప్రతిపక్ష ఎంపీలు జెన్జీ కోసం సభలో మరింత ఎక్కువ గళం ఎత్తుతారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
18 ఏండ్లకు ఓటు హక్కు వెనుక రాజీవ్ గాంధీ
‘‘రాజీవ్ గాంధీ 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కును 21 ఏండ్ల నుంచి 18 ఏండ్లకే తగ్గించారు. 18 ఏండ్లకే యువతకు ఓటు హక్కు రావడం వెనుక రాజీవ్ గాంధీ ఉన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు 73,74 రాజ్యాంగ సవరణలు తీసుకువచ్చి 21 ఏండ్లకే స్థానిక సంస్థల్లో పోటీ చేసే అవకాశం కల్పించారు.
అందువల్లే 21 ఏండ్లకే ఒక సోదరీమణి త్రివేండ్రం మేయర్ అయ్యారు. సివిల్ సర్వీస్కు అర్హత 21 ఏండ్లు మాత్రమే. ఇటీవల మహబూబ్నగర్ జిల్లాకు చెందిన అనన్య అనే అమ్మాయి 22 ఏండ్లకు ఐఏఎస్ సాధించింది. 32 ఏండ్ల క్రితం తెలంగాణ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ 22 ఏండ్లకే ఐపీఎస్ సాధించారు.
అందుకే చట్ట సభల్లో కూడా ఇదే వయస్సు ఉంటే పాలన బాగుంటుంది’’ అని చెప్పారు. జర్మనీ, బ్రిటన్ లాంటి దేశాల్లో 18 ఏండ్లకే చట్టసభలకు పోటీ చేయవచ్చని, సింగపూర్లో 21 ఏండ్లకే పోటీ చేసి ప్రధాన మంత్రి కావచ్చని, అందువల్ల మనదేశంలోనూ 21 ఏండ్ల వయసులో యువతీ యువకులు చట్టసభలకు పోటీ చేసే అవకాశం ఉండాలని అన్నారు.
అసెంబ్లీలో తీర్మానం చేయాలి: పీసీసీ చీఫ్ మహేశ్
నేటి యువత 21 ఏండ్లకే చట్ట సభల్లోకి వెళ్లేలా సీఎం రేవంత్రెడ్డి చొరవ తీసుకొని అసెంబ్లీలో తీర్మానం చేయించాలని పీసీసీ చీఫ్మహేశ్ గౌడ్ కోరారు. దేశంలో కుల గణనను మొదటగా రాష్ట్రంలోనే నిర్వహించి దేశానికి తెలంగాణ రోల్ మోడల్గా నిలిచిందని, ఇప్పుడు 21 ఏండ్లకే యువత చట్ట సభల్లోకి వెళ్లేలా మొదట తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి దేశానికి ఆదర్శంగా నిలవాలని అన్నారు.
భవిష్యత్తులో రాహుల్ గాంధీ ప్రధాని అయితే జెన్ జీ నుంచి ఒకరిని కేంద్ర విద్యా శాఖ మంత్రిగా నియమిస్తారని చెప్పారు. ఆ తర్వాత ఈ ర్యాలీలో పాల్గొన్న ఓ విద్యార్థిని మాట్లాడారు. నీట్ పరీక్షలు పారదర్శకంగా నిర్వహిస్తేనే విద్యార్థుల ఆత్మహత్యలను నివారించవచ్చని, పైగా సమర్థులే డాక్టర్లు అవుతారని అన్నారు.
క్యాండిల్ ర్యాలీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, అజారుద్దీన్, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ నేతలతోపాటు సీపీఐ నేత పల్లా వెంకట్రెడ్డి, విద్యార్థులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా జెన్ జీ పోరాట ఫలితమే
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా జెన్ జీ పోరాట ఫలితమేనని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘‘అంబేద్కర్, ఇందిరమ్మ సాక్షిగా వేలాది మంది జెన్ జీ యువత ఇక్కడికి తరలివచ్చారు. ఇక్కడికి వచ్చిన వారంతా కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు కాదు. భారత దేశ యువత సాధించిన ఈ విజయాన్ని కాంగ్రెస్ ఖాతాలో రాసుకోదల్చుకోలేదు. మీ ఈ పోరాటానికి ప్రధాని మోదీ తలవంచి ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించాడు.
ప్రధాని మోదీ.. ఈడీ, సీబీఐ లాంటి వాళ్లతో అక్రమ కేసులుపెట్టి రాజకీయ పార్టీలను లొంగదీసుకునే ప్రయత్నం చేశారు. కానీ, జెన్ జీల పోరాటాన్ని ఏ రకంగానూ ఆపలేక, వారికి తలవంచాల్సి వచ్చింది. ఇది జెన్ జీల పట్టుదలకు నిదర్శనం. ఈ విజయం ముమ్మాటికీ మీదే.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో సరిపెట్టుకోకుండా అక్రమ కేసులను తొలగించడానికి, చనిపోయిన విద్యార్థుల కుటుంబా లకు సాయం కోసం ఈ ర్యాలీ చేపట్టాం.
నీట్లో నష్టపోయిన కుటుంబాలకు అండగా ఉంటం. ఈ దేశం జెన్ జీ దే.. దేశ భవిష్యత్తే యువతరం భవిష్యత్తు, దేశం భవిష్యత్తు బాగుంటేనే యువతరం భవిష్యత్తు బాగుంటుంది” అని వ్యాఖ్యానించారు. జెన్జీ పోరాట స్ఫూర్తిని చూసి ప్రజాస్వామిక వాదులంతా తరలివచ్చి యువతకు మద్దతు ఇచ్చారని సీఎం చెప్పారు. ఇక జంతర్ మంతర్ నుంచి జెన్ జీలు పార్లమెంటుకు వెళ్లాల్సిన అవసరం ఏర్పడిందన్నారు.
