
న్యూఢిల్లీ: డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా ఆటోమేటిగ్గా జరిగిన నెలవారీ చెల్లింపులలో కొత్త రూల్స్ రేపట్నుంచి అమలు కానున్నాయి. మొబైల్ బిల్ పేమెంట్స్, ఇన్సురెన్స్ ప్రీమియమ్, కరెంటు బిల్లులు, ఓటీటీ ప్లాట్ఫామ్స్ సబ్ స్స్ర్కిప్షన్ వంటి యుటిలిటీ బిల్స్ ఇతరత్రా నెలవారీ చెల్లింపుల కోసం ఆటో డెబిట్ పేమెంట్ ఇవాళ్టి నుంచి ఆగిపోతున్నాయి. నెలవారీ చెల్లింపులకు ఇప్పటి వరకు డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డుకు లింక్ చేస్తున్న విషయం తెలిసిందే. అలా లింక్ చేస్తే చాలు ప్రతినెలా మీ ప్రమేయం లేకుండా ఈ బిల్లులు ఆటోమేటిగ్గా చెల్లింపు అయ్యేవి. ఇప్పటి వరకు నడిచిన ఈ ఇవాళే ఆకరు. రేపటి నుంచి కొత్త రూల్స్ అమలులోకి వస్తున్నాయి.
రేపటి నుంచి చెల్లింపులకు కస్టమర్ల అంగీకారం తప్పనిసరి
బ్యాంకులు గానీ, ఇతరత్ర ఆర్ధిక సంస్థలు గానీ ఆటోమేటిక్ పేమెంట్స్ కోసం కస్టమర్ల నుంచి ‘అడిషనల్ ఫాక్టర్ అథెంటిఫికేషన్ (ఏఎఫ్ఏ)’ను తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అంటే చెల్లింపు చేసే ముందు కస్టమర్ల నుంచి ప్రతిసారీ అంగీకారం పొందాల్సి ఉంటుందన్నమాట. ఇది కూడా 5 వేల రూపాయలలోపు బిల్లులకు మాత్రమే వర్తిస్తుంది. కరెక్టుగా చెల్లింపు తేదీన.. సదరు మొత్తం చెల్లించే ముందు కస్టమర్లకు మెసేజ్ వస్తుంది. మీరు ఓకే అంటేనే చెల్లింపు జరుగుతుంది.. లేదంటే చెల్లింపులు జరగబోవని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధన తీసుకొచ్చింది. ప్రతి నెలా.. ఇలా ప్రతి చెల్లింపులోనూ ఈ తతంగాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. 5 వేల రూపాయలకు మించిన లావాదేవీకి ఈ మాండేట్ (e mandate) పూర్తి చేయాల్సి ఉంటుంది. అంతే కాదు ఇది ఎంత వరకు అమల్లో ఉండాలో కూడా చెప్పాల్సి ఉంటుంది. లావాదేవీ జరిగే ముందు సంస్థలు 24 గంటలు ముందుగా కస్టమర్కు తెలపాల్సి ఉంటుంది. అవసరమైతే కస్టమర్ సదరు లావాదేవీ జరగకుండా ఆపొచ్చు.
వేటికి మినహాయింపులంటే...
ఆటో డెబిట్ కొత్త పాలసీలో కొన్ని పథకాలకు మినహాయింపులిచ్చింది ఆర్బీఐ. అవేమిటంటే బ్యాంకు ఈఎంఐలు, మ్యూచువల్ ఫండ్లకు చెల్లింపులతో పాటు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (ఎస్ఐపీ)లకు మినహాయింపు వర్తిస్తుంది. బ్యాంకు అకౌంట్ ద్వారా చెల్లించడానికి ముందే ఒప్పందం చేసుకుంటారు కాబట్టి.. వీటి చెల్లింపులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.ఫలానా సర్వీసు వొద్దని కస్టమర్లు వెళ్లిపోయినా.. థర్డ్ పార్టీ కంపెనీలు కస్టమర్ల ఖాతా నుంచి డబ్బులు డెబిట్ చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తుండడంతో ఆర్బీఐ స్పందించి కొత్త రూల్ తీసుకొచ్చింది. డేటా ప్రైవసీ, సెక్యూరిటీ విధానాలను విశ్లేషించి కొత్త రూల్స్ తెచ్చింది. థర్డ్ పార్టీ కంపెనీలు కస్టమర్ల మొత్తం ఆర్థిక లావాదేవీలను నిక్షిప్తం చేసుకుంటున్నందున.. ఈ బెడద నుంచి కస్టమర్లను కాపాడేందుకు ఆర్బీఐ ఈ మార్పులు చేసింది.