
- పెట్రోల్ పోసుకొని ఒకరు ఆత్మహత్యాయత్నం
గజ్వేల్, వెలుగు: రోడ్డు విస్తరణలో భూములు కోల్పోయే నిర్వాసితులకు డబుల్ ఇండ్లు ఇస్తామని మాట ఇచ్చి అన్యాయం చేశారని పలువురు బాధితులు నిరసనకు దిగారు. గజ్వేల్– ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధి క్యాసారంలో గత ప్రభుత్వ హయాంలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. ఇండ్లు కోల్పోయిన బాధితులకు స్థానికంగా డబుల్ ఇండ్లలో తాత్కాలిక నివాసం కల్పించారు. శాశ్వతంగా డబుల్ ఇండ్లను కేటాయిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. లబ్ధిదారుల్లో గ్రామానికి చెందిన నిర్వాసితుల పేర్లు లిస్టులో చేర్చారు. కానీ కేటాయింపు చేపట్టలేదు. దీంతో బాధితులు ఇండ్ల పొజిషన్ చూపాలని ఏండ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదు.
దీంతో బుధవారం గజ్వేల్ టౌన్ అంబేద్కర్ చౌరస్తాలో పెట్రోల్ బాటిల్ పట్టుకొని నిరసనకు దిగారు. తమకు తాత్కాలికంగా కేటాయించిన ఇండ్లకు లక్కీ డ్రాలో ఎంపికైన లబ్ధిదారులు వచ్చి ఖాళీ చేయాలంటూ ఒత్తిడి తెస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయమై పలుమార్లు అధికారులు, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఓ నిర్వాసితుడు పెట్రోల్ పోసుకోవడానికి యత్నిస్తే స్థానికులు అడ్డుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వెళ్లి నిర్వాసితులకు నచ్చజెప్పి ఆందోళన
విరమింపచేశారు.