
జగదేవపూర్ (కొమురవెల్లి), వెలుగు : ఎన్నికలకు నోటిఫికేషన్ రాకముందే ఓ గ్రామంలో సర్పంచ్, ఉప సర్పంచ్ ఎన్నిక పూర్తయింది. ఇద్దరు వ్యక్తులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ గ్రామస్తులు తీర్మానం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని పలుగుగడ్డ గ్రామంలో సుమారు 450 మంది ప్రజలు ఉండగా.. 300 మంది వరకు ఓటర్లు ఉన్నారు. వీరంతా ఒకే సామాజిక వర్గానికి వారు కావడంతో సర్పంచ్ ఎన్నికలను ఏకగ్రీవం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఇందుకోసం బుధవారం ప్రత్యేకంగా మీటింగ్ ఏర్పాటు చేసుకొని, నర్ర కనకయ్యను సర్పంచ్గా, నర్ర రాజ్కుమార్ను ఉపసర్పంచ్గా ఎన్నుకుంటూ తీర్మానం చేశారు. అనంతరం వారిద్దరినీ సన్మానించారు. అయితే నోటిఫికేషన్ రాకముందే సర్పంచ్, ఉప సర్పంచ్ను ఎన్నుకోవడం చర్చనీయాంశంగా మారింది.