
- డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు ధర్నా
నల్గొండ అర్బన్, వెలుగు: నల్గొండ ప్రభుత్వాసుపత్రిలో గర్భంలో శిశువు మరణించడం, తల్లి చావుబతుకుల్లో ఉండటంతో వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు, లంబాడీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో శుక్రవారం ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గుడిపల్లి మండలం కేశినేని తండాకు చెందిన జటావత్ ఝాన్సీ మొదటి కాన్పు కోసం ఈనెల 6 వ తేదీన నల్గొండ ప్రభుత్వాసుపత్రిలో అడ్మిట్ అయింది.
గురువారం పురిటినొప్పులు పరిశీలించగా కడుపులోని పాప చనిపోయిందని నిర్ధారించారు. మృత శిశువును డాక్టర్లు డెలివరీ చేశారు. తల్లి పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రికి రెఫర్ చేశారు. శిశువు మృతికి ప్రభుత్వ డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని కుటుంబసభ్యులు, బంధువులు ఆసుపత్రి ఎదుట ధర్నా చేపట్టారు.