
హైదరాబాద్: జాతీయ క్రీడా దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆదివారం గచ్చిబౌలి స్టేడియం వద్ద జరిగిన ‘ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమాన్ని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జెండా ఊపి ప్రారంభించారు. పర్యావరణహితానికి, పచ్చని జీవన శైలికి సైక్లింగ్ ఎంతో దోహదం చేస్తుందని ఆయన అన్నారు.
‘భారత ప్రభుత్వం చేపట్టిన సండేస్ ఆన్ సైక్లింగ్ కార్యక్రమం జాతీయ ఫిట్నెస్ ఉద్యమంలా తెలంగాణలో నిర్వహించాలి. ఫిట్నెస్కి డోస్ అరగంట రోజ్ అన్న నినాదాన్ని విద్యార్థులు, యువకులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు తీసుకెళ్లాలి. క్రీడా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల సామాజిక బంధాలు బలపడతాయి’ అని గవర్నర్ పేర్కొన్నారు. తెలంగాణ క్రీడా శాఖ, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సం తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహించామని క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఇది దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రతి ఒక్కరు ఇందులో భాగం కావడం హర్షనీయమని చెప్పారు.