మహిళల ద్వారా మస్కట్​కు రోల్డ్​గోల్డ్​ పంపేందుకు యత్నం

మహిళల ద్వారా మస్కట్​కు  రోల్డ్​గోల్డ్​ పంపేందుకు యత్నం
  • హ్యూమన్​ ట్రాఫికింగ్​ ముఠాకు చెందిన వ్యక్తి అరెస్ట్​
  • విజిట్​ వీసాపై పని చేయడం చట్టవిరుద్ధం : పోలీసులు

శంషాబాద్, వెలుగు:ఇద్దరు మహిళల ద్వారా మస్కట్​కు రోల్డ్​గోల్డ్​జువెల్లరీ పంపేందుకు ప్రయత్నించిన ఓ వీసా ఏజెంట్​ను ఆర్​జీఐ ఎయిర్​పోర్ట్​పోలీసులు అరెస్ట్​చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలానికి చెందిన లంకపల్లి మేరీ 4 నెలల క్రితం మస్కట్‌‌‌‌లో ఉద్యోగావకాశం కోసం అదే జిల్లాకు చెందిన వీసా ఏజెంట్ ఆకుమర్తి సత్యనారాయణను సంప్రదించింది. అతను వర్క్ వీసా, పీవోఈ సర్టిఫికెట్, మెడికల్ క్లియరెన్స్ కలిపి ఇస్తానని హామీ ఇచ్చాడు.

తన పాస్​పోర్ట్​డేట్​అయిపోయిందని చెప్పడంతో కొత్త పాస్‌‌‌‌పోర్ట్ తీయించి,  మెడికల్ టెస్ట్​లు చేయించి, వీసా, విమాన టికెట్లు ఇప్పిస్తానన్నాడు. ఇందుకోసం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నీ తాను చూసుకుంటానని తెలిపాడు. ఈ నెల 4న మేరీ తన కుమారుడితో కలిసి తనుకు రైల్వేస్టేషన్‌‌‌‌కు వెళ్లింది. అక్కడికి సత్యనారాయణ మరో మహిళ కొండలమ్మతో వచ్చాడు. అందరూ కలిసి మరుసటి రోజు హైదరాబాద్ చేరుకున్నారు. సత్యనారాయణ ఆ ముగ్గురినీ ఆర్​జీఐ ఎయిర్‌‌‌‌పోర్ట్ సమీపంలోని ఓ హోటల్‌‌‌‌లో ఉంచాడు. రాత్రి పాస్‌‌‌‌పోర్ట్​లు, విమాన టికెట్లు, మస్కట్ విజిట్ వీసాలు ఇచ్చి, సందర్శన కోసం వెళ్తున్నామని చెప్పాలని సూచించాడు. 

నిజం చెప్పిన మహిళలు..

అయితే, ఇమిగ్రేషన్ కౌంటర్​లో వారు తాము పని చేయడానికి వెళ్తున్నామని, వీసాలు ఏర్పాటు చేసిన వ్యక్తి సత్యనారాయణ అని, మస్కట్‌‌‌‌లో సుందరం అనే వ్యక్తి రిసీవ్ చేసుకుంటాడని తెలిపారు. పీవోఈ(ప్రొటెక్టర్స్​ఆఫ్ ఎమిగ్రెంట్స్) సర్టిఫికెట్​లేకుండా విజిట్ వీసాపై పని చేయడం చట్టవిరుద్ధమని, ప్రమాదకరమని ఇమిగ్రేషన్​అధికారులు వారికి సూచించారు. దీంతో బాధితులు ఆర్​జీఐ పోలీసులకు ఫిర్యాదు చేసి, పాస్‌‌‌‌పోర్ట్ లు, వీసాలు, విమాన టికెట్లు అందజేశారు. ఆకుమర్తి సత్యనారాయణపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. వారు కేసు నమోదు చేసి,  నిందితుడిని ఆదివారం అరెస్ట్ చేశారు. విచారణలో అతను మస్కట్‌‌‌‌లో ఉన్న ఏజెంట్ సుందరం ఏర్పాటు చేస్తున్న రోల్డ్ గోల్డ్ అండ్ ఫ్యాన్సీ సెంటర్ కు శాంపిల్ రోల్డ్ గోల్డ్ ఆభరణాలు పంపిస్తున్నట్లు అంగీకరించాడు. 

సత్యనారాయణ గల్ఫ్ దేశాలకు పీవోఈ సర్టిఫికెట్ లేకుండా మహిళలను అక్రమంగా పంపేందుకు కొత్త మార్గాలు అన్వేషిస్తున్న హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠాకు చెందినవాడని పోలీసులు తేల్చారు. గల్ఫ్​దేశాల్లోని ఇండ్లలో పని చేసేందుకు మనుషులు కావాలనేవారి నుంచి సుందరం ఒక్కో మనిషికి రూ.1.5 లక్షల చొప్పున తీసుకుంటున్నాడని, వర్క్ వీసా లేకుండా పని కావాలనుకునేవారికి టికెట్స్, విజిట్ వీసాలు ఇచ్చి, పంపిస్తున్నాడని సత్యనారాయణ తెలిపాడన్నారు. రోల్డ్ గోల్డ్ ఆభరణాలు, ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. పీవోఈ సర్టిఫికెట్​నాంపల్లి లోని ప్రొటెక్టర్స్​ఆఫ్ ఎమిగ్రెంట్స్ ఆఫీస్ లో ఇస్తారని, దానికి రూ.38 వేల ఫీజు ఉంటుందని తెలిపారు. అది లేకుండా విదేశాలకు పని నిమిత్తం వెళ్లడం అక్రమమని, శిక్షార్హమని చెప్పారు.