
- నా కొడుకుల నుంచి రక్షణ కల్పించండి
- పోలీసులను వేడుకున్న వృద్ధురాలు
బషీర్బాగ్, వెలుగు: కన్న కొడుకుల నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలంటూ ఓ వృద్ధురాలు పోలీసులను వేడుకున్నారు. మల్కాజిగిరికి చెందిన 67 ఏండ్ల భద్రమ్మ సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో తన గోడును వెళ్లబోసుకున్నారు. తన భర్త కష్టపడి సంపాదించిన ఆస్తిని తన కొడుకులు అనిల్, వినయ్ అక్రమంగా ఆక్రమించుకొని, తనను రోడ్డుపాలు చేశారని కన్నీరు పెట్టుకున్నారు.
తన కుమార్తె చేరదీయకపోతే అడుక్కొని బతకాల్సిన పరిస్థితి వచ్చేదని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు కోట్ల విలువ చేసే ఆస్తిని కాజేయాలని నకిలీ పత్రాలను సృష్టించారని, దీనిపై మల్కాజిగిరి పీఎస్లో ఫోర్జరీ కేసు నమోదైనా చర్యలు తీసుకోవడం లేదన్నారు. తనను ఎలాగైనా అంతమొందించి ఆస్తిని కాజేయలని చూస్తున్న తన కొడుకులపై చర్యలు తీసుకొని, తనకు రక్షణ కల్పించాలన్నారు.