కరీంనగర్, వెలుగు: కరీంనగర్ లో ఈ నెల 12న నిర్వహించే హిందూ ఏక్తా యాత్రను సక్సెస్ చేసి మరోసారి చరిత్ర సృష్టిద్దామని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. రాజకీయాలకు అతీతంగా జరిగే ఈ హిందూ ఏక్తా యాత్రకు ప్రతి ఒక్కరూ తరలివచ్చి హిందూ సంఘటిత శక్తిని చాటి చెప్పాలని కోరారు. ఏక్తా యాత్ర ఏర్పాట్లు, జన సమీకరణపై ఆదివారం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో గాయత్రీనగర్ బ్యాంకెట్ హాల్లో జిల్లా నాయకులతో, సాయంత్రం జ్యోతినగర్ లోని శ్రీ మహాశక్తి బాంక్వెట్ హాలులో కరీంనగర్ కార్పొరేటర్లు, ఇతర నేతలతో సమావేశం నిర్వహించారు.
మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, బాస సత్యనారాయణ, డి.శంకర్, కోమాల ఆంజనేయులు, గుగ్గిళ్ల రమేశ్, నల్లాల ఓదేలు పాల్గొన్నారు. యాత్రకు తరలివచ్చేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని, వారికి తగిన రవాణా ఏర్పాట్లు చేయాలని యాత్రకు తీసుకురావాలని కోరారు. కరీంనగర్ లోని వైశ్యా భవన్ నుంచి 12న సాయంత్రం 4 గంటలకు యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు.
