యాక్టివాపై రాంగ్ రూట్లో పోతున్నడు.. పోలీసులు బండి ఆపారు.. రూ.10 లక్షలకు పెండింగ్ ఛలాన్లు చూసి బిత్తరపోయారు !

యాక్టివాపై రాంగ్ రూట్లో పోతున్నడు.. పోలీసులు బండి ఆపారు.. రూ.10 లక్షలకు పెండింగ్ ఛలాన్లు చూసి బిత్తరపోయారు !

హర్యానా: మన దేశంలో ఒక స్కూటీపై ఇంత పెద్ద మొత్తంలో ఛలాన్లు పడిన సందర్భాలు గతంలో దాదాపుగా లేవు. స్కూటీపై 96 పెండింగ్ ఛలాన్లు, 10 లక్షల రూపాయలు ఫైన్లతో ఒక ప్రబుద్ధుడు రోడ్ల మీద తిరుగుతూ పోలీసులకు దొరికిపోయాడు. 2017 మోడల్ స్కూటీ ప్రస్తుతం ఎలా చూసుకున్నా.. 50 వేలకు మించి ఎక్కువకు అమ్ముడుపోదు. అలాంటి స్కూటీపై 10 లక్షల పెండింగ్ ఛలాన్లు ఉన్నాయని తెలిసి పోలీసులు విస్తుపోయారు. ఆ స్కూటీ నిందితుడి సోదరి పేరు మీద రిజిస్టర్ అయి ఉంది.

నిందితుడు ప్రశాంత్ గురుగ్రామ్లోని రాజీవ్ చౌక్ దగ్గర మేధాంత హాస్పిటల్ దగ్గర రాంగ్ రూట్లో వస్తూ పోలీసులకు దొరికిపోయాడు. అతనిని అదుపులోకి తీసుకుని స్కూటీ డాక్యుమెంట్లు అడిగితే అలాంటివేవీ తన దగ్గర లేవని చెప్పాడు. హెల్మెట్ లేదు, ఇన్సూరెన్స్ లేదు, పొల్యూషన్ సర్టిఫికెట్ లేదు.. కానీ ఫుల్ ట్రాఫిక్ ఉన్న రోడ్డుపై రాంగ్ రూట్లో వెళుతున్నాడు.

ఈ ప్రబుద్ధుడి పెండింగ్ ఛలాన్ల లిస్ట్ చూస్తే.. ఎక్కువగా హెల్మెట్ ధరించలేదని, ఇన్సూరెన్స్ లేదని, పొల్యూషన్ సర్టిఫికెట్ లేదని విధించిన ఛలాన్లే ఎక్కువగా కనిపించాయి. గురుగ్రామ్ రాజీవ్ చౌక్ జోనల్ ఆఫీసర్, ఏఎస్ఐ విజయ్ సింగ్ తన టీంతో రెగ్యులర్ మెహికల్ చెకింగ్స్ చేస్తుండగా ప్రశాంత్ ఇలా అడ్డంగా దొరికిపోయాడు. ఈ టోటల్ ఎపిసోడ్లో మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. ప్రశాంత్ యాక్టివాకు విధించిన ఈ 96 పెండింగ్ ఛలాన్లలో 95 ఛలాన్లు సీసీటీవీ, హైటెక్ కెమెరాల కంట పడటంతో ఆటెమేటిక్గా విధించినవే కావడం గమనార్హం. ఒక్కసారి మాత్రమే పోలీసులకు దొరకడంతో ఛలాను పడింది. ప్రశాంత్ సీసీ కెమెరాలను పట్టించుకోకుండా ఇష్టారీతిన రాకపోకలు సాగించాడు. ఇలా వెళ్లడం వల్లే మొత్తం ₹10 లక్షలకు పైగా ఫైన్లు పడ్డాయి.

ఈ తరహాలోనే మన తెలంగాణలో కూడా 2025, అక్టోబర్ నెలలో ఒక బైక్పై దాదాపు 80 వేల రూపాయల ఛలాన్లు ఉన్నట్లు ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో వెల్లడైంది. ఒకే బైక్పై 277 ట్రాఫిక్ చలాన్లు పెండింగ్లో ఉన్నట్లు పోలీసుల తనిఖీలో బయటపడింది. కరీంనగర్ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ రమేశ్, కానిస్టేబుల్ శ్రీనివాసరావు కలిసి పట్టణంలో వాహన తనిఖీలు చేపట్టిన క్రమంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ టైంలో అటువైపు వచ్చిన కరీంనగర్లోని గోదాంగడ్డకు చెందిన అబ్దుల్ ఖయ్యూమ్కు చెందిన బైక్ను ఆపారు. ఆన్ లైన్లో చలాన్లను తనిఖీ చేయగా రూ.79,845 విలువైన 277 చలాన్లు పెండింగ్లో ఉన్నట్లు తేలింది