జాతీయ రహదారులపై ప్రమాదాల తగ్గినట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. కోవిడ్ తర్వాత నేషనల్ హైవేలపై మరణాల సంఖ్య దాదాపు 4 శాతం తగ్గిందని బుధవారం (ఆగస్టు 05) పార్లమెంటులో వెల్లడించారు.
హైవేలపై యాక్సిడెంట్స్ లలో చనిపోయే వారి సంఖ్య 2025లో 62 వేల 122 కు తగ్గినట్లు చెప్పారు. 2024లో 64 వేల 772 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతే.. 2023లో 63 వేల 112 మంది చనిపోయినట్లు తెలిపారు. ప్రతి ఏటా మరణాల సంఖ్య పెరుగుతూ వస్తుండేదని.. కానీ కరోనా తర్వాత తొలిసారి 2025లో మృతుల సంఖ్య తగ్గినట్లు చెప్పారు.
అదే సమయంలో 2025లో రోడ్డు యాక్సిడెంట్ల సంఖ్య 5.30 శాతం పెరిగినట్లు చెప్పారు. అంటే 5.13 లక్షల యాక్సిడెంట్స్ జరిగినట్లు చెప్పారు. సరాసరిగా గంటకు 21 మంది చనిపోయినట్లు వెల్లడించారు.
నేషనల్ హైవేస్ పై 2025లో లక్షా 43 వేల 526 ప్రమాదాలు జపగగా.. ఈ ఏడాది జులై 27 వరకు 77 వేల 234 ప్రమాదాలు జరిగినట్లు చెప్పారు.
తమిళనాడులో అత్యధిక ప్రమాదాలు:
జాతీయ రహదారులపై జరిగే ప్రమాదాల్లో తమిళనాడులో ఎక్కువగా జరుగుతున్నట్లు గడ్కరీ చెప్పారు. 71 వేల 387 యాక్సిడెంట్స్ తో తమిళనాడులో ముందంజలో ఉన్నట్లు చెప్పారు. అదేసమయంలో రోడ్డు ప్రమాద మృతులలో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉన్నట్లు తెలిపారు. 2025లో ఆ రాష్ట్రంలో 27 వేల 550 మంది చనిపోయినట్లు గణాంకాలు పార్లమెంటుకు తెలిపారు.
