కాలువలో మునిగిపోతున్న యువకుడిని కాపాడిన 108 సిబ్బంది

కాలువలో మునిగిపోతున్న యువకుడిని కాపాడిన 108 సిబ్బంది

పెబ్బేరు, వెలుగు :  ప్రమాదవశాత్తు ఫిట్స్ రావడంతో కాలువలో పడిపోయిన ఓ యువకుడిని 108 సిబ్బంది సమయానికి కాపాడి ప్రాణాలు రక్షించిన ఘటన వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం తోమాలపల్లి వద్ద జరిగింది. మహారాష్ట్రలోని లాతూర్‌‌‌‌‌‌‌‌కు చెందిన హర్షద్ తిరుపతికి వెళ్లి తిరిగి వస్తుండగా కుటుంబ సభ్యులతో కలిసి తోమాలపల్లి సమీపంలోని జూరాల కాలువ వద్ద ఆగారు. అక్కడ   వంటలు సిద్ధం చేస్తున్న సమయంలో హర్షద్ కాలువలోకి దిగి ముఖం కడుక్కోవడానికి వెళ్లగా అకస్మాత్తుగా ఫిట్స్ వచ్చి నీటిలో పడిపోయాడు.

వెంటనే కుటుంబ సభ్యులు, స్థానికులు 108కు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఖాజా, మసూం బాబా ఘటనాస్థలికి చేరుకుని కాలువలోకి దిగి నీటిలో మునిగిపోతున్న హర్షద్‌‌‌‌‌‌‌‌ను బయటకు తీశారు. సుమారు 300 మీటర్ల దూరం నుంచి అతడిని ఒడ్డుకు చేర్చి 108 వాహనంలో వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం హర్షద్ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. సమయానికి స్పందించిన 108 సిబ్బందిని స్థానికులు, కుటుంబ సభ్యులు అభినందించారు.