ఆన్లైన్ మోసగాళ్లు రోజురోజుకూ కొత్త కొత్త పద్ధతులతో రెచ్చిపోతున్నారు. అమాయక ప్రజలను మోసం చేసేందుకు ఏకంగా దేశ ఆర్థిక మంత్రి పేరును కూడా వాడుకుంటున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేరుతో జరిగిన ఒక భారీ పెట్టుబడి మోసంలో ఓ డాక్టర్ ఏకంగా 86 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి...
అసలు ఏం జరిగిందంటే... హైదరాబాద్లోని మీర్పేట్కు చెందిన ఒక 76 ఏళ్ల రిటైర్డ్ డాక్టర్ సోషల్ మీడియాలో వచ్చిన ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రకటనను చూశారు. ఆ అడ్వర్టైజ్మెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేరు, ఫోటోలను మోసగాళ్లు వాడారు. ఆ ప్రకటన నిజమేనని నమ్మిన డాక్టర్, అందులోని లింక్పై క్లిక్ చేశారు.
దింతో వెంటనే ఒక పెద్ద వెంచర్ క్యాపిటల్ కంపెనీ ప్రతినిధులమంటూ ఇద్దరు వ్యక్తులు ఆయనకు ఫోన్ చేశారు. మా సంస్థలో పెట్టుబడి పెడితే భారీగా లాభాలు వస్తాయని నమ్మించారు.
విడతల వారీగా దోపిడీ
బాధితుడితో ఒక నకిలీ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయించిన మోసగాళ్లు, ఆయనను రకరకాల పేర్లతో డబ్బులు కట్టించుకోవడం మొదలుపెట్టారు. మొదట రిజిస్ట్రేషన్ ఫీజు అని, ఆ తర్వాత ట్రేడింగ్ చార్జీలని చెప్పారు. చివరికి కమీషన్, బ్యాంక్ చార్జీలు, సెబీ (SEBI) ఫీజులు, పన్నుల (tax) నెపంతో పలు విడతలుగా మొత్తం రూ. 86.44 లక్షలు బ్యాంకు అకౌంట్స్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు.
లాభాలు చూపిస్తూ ఆశ..
డాక్టర్కు అనుమానం రాకుండా ఉండేందుకు, ఆయన పెట్టిన పెట్టుబడికి భారీగా లాభాలు వస్తున్నట్లు ఒక నకిలీ అప్లికేషన్ (App) ద్వారా స్క్రీన్పై చూపించారు. ఆ లాభాల డబ్బును విత్డ్రా చేసుకోవాలని డాక్టర్ ప్రయత్నించగా.. ఆ డబ్బులు రిలీజ్ కావాలంటే మరికొంత టాక్స్ కట్టాలి, అలాగే ఇంకాస్త మనీ డిపాజిట్ చేయాలి అంటూ మళ్లీ డబ్బులు డిమాండ్ చేయడం మొదలుపెట్టారు.
ALSO READ : మహారాష్ట్రలో బైక్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
దీంతో తాను మోసపోయానని గ్రహించిన ఆ డాక్టర్ వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఆ మోసగాళ్ల బ్యాంక్ అకౌంట్ల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. సోషల్ మీడియాలో ప్రముఖుల ఫోటోలు, పేర్లతో వచ్చే ఇలాంటి 'హై రిటర్న్స్' పెట్టుబడి ప్రకటనలను అస్సలు నమ్మకండి. ఏదైనా వెబ్సైట్లో డబ్బులు పెట్టే ముందు అది ప్రభుత్వ గుర్తింపు పొందిందో లేదో ఒకటికి రెండుసార్లు చెక్ చూసుకోండి.
