Womens Rising Stars Asia Cup: రాధా యాదవ్ ఆల్‌రౌండ్ షో: ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్

Womens Rising Stars Asia Cup: రాధా యాదవ్ ఆల్‌రౌండ్ షో: ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్

Womens Rising Stars Asia Cup: ఉమెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026లో భారత్-A మహిళల జట్టు అదరగొట్టింది. బ్యాంకాక్‌లోని టెర్డ్తాయ్ క్రికెట్ గ్రౌండ్ లో ఇవాళ (ఫిబ్రవరి 20) జరిగిన తొలి సెమీఫైనల్‌లో శ్రీలంక-A జట్టుపై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. 119 పరుగుల లక్ష్యాన్ని చేధించిన టీమిండియా-A, కేవలం 13.3 ఓవర్లలోనే 119/5 పరుగులు చేసి గ్రాంఢ్ విక్టరీ సాధించింది. ఈ విజయం ద్వారా ఆదివారం జరిగే ఫైనల్‌లో బంగ్లాదేశ్ ఏ మహిళల జట్టు లేదా పాకిస్థాన్ ఏ మహిళల జట్టుతో  తలపడనుంది. 

రాధా యాదవ్ ఆల్‌రౌండ్ షో: 
భారత్–A జట్టు కెప్టెన్ రాధా యాదవ్ అద్భుతమైన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డును సొంతం చేసుకుంది. బౌలింగ్‌లో 4/19 గణాంకాలతో శ్రీలంక ఏ బ్యాటింగ్ లైనప్‌ను కూల్చివేయడంతో పాటు చేజ్‌లో కూడా 18 బంతుల్లోనే 31 పరుగులు చేసి భారత జట్టుకు విజయాన్ని అందించింది.  

బ్యాటింగ్‌లో ఆధిపత్యం: 
భారత్-A జట్టు తరఫున వృందా దినేష్ 20 బంతుల్లో 42 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. అనుష్క శర్మ ( 27) నందిని కశ్యప్ (16) కూడా ఫర్వాలేదనిపించారు. చివర్లో తేజల్ హసాబ్నిస్ ( 6), మిన్ను మణి (2) మ్యాచ్‌ను సునాయాసంగా ముగించారు.

శ్రీలంక ఏ 118కే ఆలౌట్: 
అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక-A, 19.4 ఓవర్లలో 118 పరుగులకే ఆలౌటైంది. సంజనా కవింది 35 బంతుల్లో 31 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, శషిని గింహాని 17 బంతుల్లో 22 పరుగులు చేసింది. రాధా యాదవ్ నాలుగు వికెట్లు పడగొట్టడంతో శ్రీలంక ఇన్నింగ్స్ గాడి తప్పింది.  

టైటిల్ డిఫెన్స్‌పై భారత్-A నజర్: 
డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఈ టోర్నీలోకి అడుగు పెట్టిన భారత్-A, ఇప్పుడు టైటిల్‌ను నిలుపుకునే మరో అవకాశం ఉంది. గ్రూప్ దశలో యూఏఈపై తొలి మ్యాచ్‌లో అనూహ్యంగా ఓడినప్పటికీ, ఆ తర్వాత పాకిస్థాన్ ఏపై 8 వికెట్ల తేడాతో, నేపాల్ పై 7 వికెట్ల తేడాతో గెలిచి గ్రూప్ టాప్‌లో నిలిచింది. కట్టుదిట్టమైన ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఫైనల్‌కు చేరిన భారత్ ఏ మహిళల జట్టు, రాధా యాదవ్ నాయకత్వంలో హాట్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. దూకుడైన బ్యాటింగ్, క్రమశిక్షణ గల బౌలింగ్‌తో భారత్ టైటిల్ డిఫెన్స్‌కు స్ట్రాంగ్ పోటీ ఇవ్వనుంది.